కరోనా మృతుడు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరెవరిని కలిశాడు..?
కరోనా వైరస్తో భారత్లో తొలి మరణం సంభవించిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన కలబుర్గివాసి సిద్దిఖీ(76) కరోనా వైరస్ సోకి గురువారం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు భయాందోళన చెందవద్దని చెబుతున్నాయి. మృతి చెందిన వ్యక్తి హైదరాబాద్ వచ్చినట్టు నిర్దారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లో అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు.. ఎవరెవరిని కలిశాడు అన్న విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

సిద్దిఖీ ట్రావెల్ హిస్టరీ
మృతుడి ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తే.. సౌదీ నుంచి అతను కర్ణాటకలోని బీదర్కు వచ్చాడు. అనంతరం జ్వరం కారణంగా ఓ స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుల్బర్గా మెడికల్ కాలేజీకి వెళ్లమని చెప్పగా.. అతను మాత్రం కుటుంబ సభ్యులు,బంధువులతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లగా.. అక్కడి వైద్య సిబ్బంది అందుకు నిరాకరించారు. అప్పటికే అతను కరోనా అనుమానితుడిగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని వారు సూచించారు. కానీ అతను మాత్రం తిరిగి కర్ణాటక బయలుదేరి మార్గమధ్యలో మృతి చెందాడు.

పాతబస్తీకి వెళ్లిన సిద్దిఖీ
వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో సిద్దిఖీ పాతబస్తీలోని మీర్ చౌక్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో తెలంగాణ వైద్యశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వైలైన్స్ టీమ్ అక్కడికెళ్లి ఆ ఇంట్లో వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ వారికి కరోనా సోకితే.. అది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. కొద్దిరోజుల పాటు వారిని ఇంట్లోనే మెడికల్ అబ్జర్వేషన్లో పెట్టనున్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు సిద్దిఖీని బయటకు ఎందుకు వదిలాయన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. వైద్యశాఖకు సమాచారం ఇవ్వకుండా సిద్దిఖీని బయటకు పంపించడంపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లిన సిద్దిఖీ ఎమర్జెన్సీ వార్డులో 45 నిమిషాల పాటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో అతని ద్వారా అక్కడి నర్సులు లేదా సిబ్బందికి వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనా అనుమానితులను బయటకు పంపించవద్దని ఆదేశాలు
కరోనా అనుమానిత కేసుల్లో పూర్తి స్థాయి రిపోర్ట్స్ వచ్చేంతవరకు.. పేషెంట్స్ను బయటకు పంపించవద్దని కంట్రోల్ రూమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే శంషాబాద్ విమానాశ్రయంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతీరోజూ విదేశాల నుంచి 4వేల మంది శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి సౌదీకి వెళ్లేవారి సంఖ్య ఎక్కువన్న సంగతి తెలిసిందే. సౌదీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. అక్కడినుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి.. అనుమానిత లక్షణాలు ఉంటే అంబులెన్స్ ద్వారా ఫీవర్ ఆసుపత్రి లేదా గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. ఇక తెలంగాణలో వైరస్ పరీక్షల కోసం మరో ఐదు ల్యాబ్లకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇంతకుముందు కేవలం గాంధీ వైరలాజీ ల్యాబ్కు మాత్రమే కరోనా టెస్టులకు అనుమతినిచ్చింది. తాజాగా ఉస్మానియాతో పాటు కాకతీయ మెడికల్ కాలేజీకి కూడా అనుమతినిచ్చింది.

ఇప్పటివరకు 75 పాజిటివ్ కేసులు
సిద్దిఖీ మరణంతో కలబుర్గిలో 46 మందిని అక్కడి అధికారులు క్వారెంటైన్లో ఉంచారు. వారంతా సిద్దిఖీతో కలిసినట్టు గుర్తించడంతో అందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటివరకు దేశంలో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలో 1,పంజాబ్ 1,ఢిల్లీ 7,జమ్మూకశ్మీర్ 1,లడఖ్ 3,రాజస్తాన్ 3,ఉత్తరప్రదేశ్ 11,మహారాష్ట్ర 11,కర్ణాటక 5,తమిళనాడు 1,,హర్యానాలో 14 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications