coronavirus: రహేజా ఐటీ పార్క్ ఖాళీ, ఉద్యోగులు ఇక వర్క్ ఫ్రమ్ హోం, గాంధీకి అనుమానితుల తాకిడి
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మనదేశంలో కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 28 కరోనా కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. కాగా, హైదరాబాద్లో ఇప్పటికే ఒక కరోనావైరస్ కేసు గుర్తించిన విషయం తెలిసిందే.
Recommended Video
గాంధీ ఆస్పత్రికి అనుమానితుల తాకిడి..
అయితే, కరోనా వైరస్ కేసు నేపథ్యంలో సాధారణ జలుపు, జ్వరం వచ్చిన బాధితులు కూడా కరోనా ఏమైనా సోకిందనే అనుమానంతో ఆస్పత్రులకు బారులు తీరుతున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీ ఆస్పత్రిలో మొత్తం 47 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 45 మందికి కరోనా లేదని తేల్చారు వైద్యులు.
మరో ఇద్దరికి కరోనా లక్షణాలు.. పుణెకు నమూనాలు
మరో ఇద్దరిపై అనుమానం ఉండటంతో వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పుణెకు పంపినిట్లు గాంధీ వైద్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఇద్దరి రక్త పరీక్షల ఫలితాలు గురువారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా వైరస్ బారిన పడ్డారని భావిస్తున్న ఈ ఇద్దరిలో ఒకరు ఇటలీ నుంచి వచ్చినవారు కాగా, మరొకరు.. కరోనా పాజిటివ్ కేసుగా గాంధీలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి స్నేహితుడని తెలిపారు. అందుకే వీరి రక్తనమూనానలు పుణెకు పంపినట్లు తెలిపారు. డిశ్చార్జ్ చేసిన 45 మందిని కూడా జనసంచారానికి దూరంగా హౌస్ ఐసోలేషన్లో ఉండాలని సూచించినట్లు వైద్యులు వెల్లడించారు.
కరోనా అనుమానుతుల తాకిడితో.. గాంధీకి తగ్గిన సాధారణ పేషెంట్లు..
కాగా, బుదవారం మరో 23 మంది కరోనా అనుమాతులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. వారి రక్త నమూనాలు కూడా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహించి నెగెటివ్గా తేలినవారిని వెంటనే డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా అనుమాతుల తాకిడి గాంధీ ఆస్పత్రిలో పెరుగుతుండటంతో సాధారణ రోగులు గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో సాధారణ పేషెంట్ల తాకిడి తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే కరోనా యూనిట్ గాంధీ నుంచి తరలించాలంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగుల బంధువులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
టెక్కీకి కరోనా.. రహేజా ఐటీ పార్కు ఖాళీ.. వర్క్ ఫ్రం హోం..
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలోని రహేజా ఐటీ పార్కులో ఓ సాఫ్ట్వేర్(డీఎస్ఎం) ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో రహేజా ఐటీ పార్కులో ఉన్న ఉద్యోగులు అందరినీ పోలీసులు ఇళ్లకు పంపుతున్నారు. కాగా, రహేజా మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 20లో పనిచేస్తున్న డీఎస్ఎం ఉద్యోగులందర్నీ వచ్చే మంగళవారం వరకు ఇంటి నుంచే పని చేయాలని కంపెనీ యాజమాన్యం సూచించింది. జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది.