కరోనా: కేసీఆర్ చెప్పినట్లే జరుగుతోంది.. 95 శాతం భారం తగ్గిందన్న ఈటల.. 453కు పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల నమోదు, చికిత్స జరుగుతోన్న తీరును బట్టి ఏప్రిల్ రెండో వారంలోగా మంచి ఫలితాలు రావోచ్చన్న సీఎం కేసీఆర్ ఆశాభావం నిజమయ్యేలా కనిపిస్తోంది. బుధవారం నాటికి రాష్ట్రంలో కొత్తగా 49 పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ.. క్వారంటైన్ల లెక్కలు, క్రిటికల్ కేసులు లేకపోవడాన్నిబట్టి 95 శాతం భారం తగ్గినట్లేనని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రోజువారీ బ్రీఫింగ్ లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు చెప్పారాయన.

ముగిసిన గడువు..
ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన 1100 మందికి టెస్టులు చేశామని, అందులో నెగటివ్ వచ్చినవాళ్ళతోపాటు పాజిటివ్ గా తేలినవాళ్ల కుటుంబీకులను కూడా క్వారంటైన్ కు తరలించామని, మొత్తం మర్కజ్ కాంటాక్టులుగా పరిగణించే 3,158 మందిని వివిధ ప్రాంతాల్లోని 167 క్వారంటైన్ కేంద్రాలో ఉంచామని, గడువు పూర్తి కావడంతో మళ్లీ పరీక్షలు జరిపి.. ఇళ్లకు పంపుతామని, ఈనెల 28 వరకు కూడా వాళ్లందరూ హోం క్వారంటైన్ లోనే ఉండాలని ఆదేశిస్తామని మంత్రి ఈటల చెప్పారు. వైద్య బృందాలు రోజుకు రెండు సార్లు ఆయా ఇళ్లకు వెళ్లి పరిశీలన జరుపుతారని చెప్పారు. క్వారంటైన్ లో ఉన్నవాళ్ల గడువు ముగియడంతో గత నాలుగైదు రోజులుగా శాంపిల్స్ టెస్టులు చేశామని, తద్వారా 95 శాతం భారం తగ్గినట్లయిందని, ప్రస్తుతానికి 535 శాంపిల్స్ మాత్రమే పరీక్షచేయాల్సి ఉన్నదని, అంటే, ఒకేసారి పెద్ద ఎత్తున కేసులు చోటుచేసుకునే ప్రమాదం ప్రస్తుతానికి తప్పినట్లేనని మంత్రి వివరించారు.

కొత్త కేసులు 49..
బుధవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో కొత్తగా 49 కొవిడ్-19 కేసులు వెలుగులోకి వచ్చాయని, దాంతో మొత్తం కేసుల సంఖ్య 453కి పెరిగిందని మంత్రి చెప్పారు. నమోదైన మొత్తం కేసుల్లోనుంచి 45మందిని డిశ్చార్జ్ చేయగా, 11 మంది చనిపోయారని తెలిపారు. యాక్టివ్ కేసులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న 397 మందిలో ఏ ఒక్కరు కూడా ప్రాణాపాయ స్థితిలో లేరని, వెంటిలేటర్ అవసరం కూడా ఏర్పడలేదని ఈటల తెలిపారు.
Recommended Video

వసతుల కొరత లేదు..
కరోనా కారణంగా అమెరికా లాంటి ఫార్వర్డ్ దేశాల్లోనూ పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కుల కొత ఏర్పడిందని, అయితే తెలంగాణలో మాత్రం వైద్య సిబ్బంది రక్షణ పరికరాలకు ఎలాంటటి కొరత రానివ్వబోమని మంత్రి చెప్పారు. ఇప్పటికే 80 వేల పీపీఈ కిట్లు అందుబాటు ఉండగా, మరో 5లక్షల కిట్లు ఆర్డర్ ఇచ్చామని, లక్షకు పైగా ఎన్95 మాస్క్లు ఉన్నా, కొత్తగా మరో 5 లక్షల మాస్కులు తెప్పిస్తున్నామని, అలాగే 2కోట్ల డాక్టర్ మాస్క్లు, 5లక్షల గాగూల్స్ తోపాటు 3.5లక్షల కరోనా టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ పెట్టామన్నారు. 15 రోజుల వ్యవధిలోనే గచ్చిబౌలిలో 1500 బెడ్లతో ఆస్పత్రి సిద్ధం చేశామని, ప్రభుత్వాసుపత్రులే కాకుండా 22 ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆస్పత్రులనూ వాడుకుంటున్నామన్నారు.












Click it and Unblock the Notifications