జగన్ తో కేసీఆర్ సర్కారును పోల్చుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను గాలికొదిలేశారు..
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో జగన్ సర్కారు ముందంజలో ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంటే, ప్రభుత్వం నిద్రపోతున్నదని, ప్రజలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా టెస్టులు, కేసుల అంశంలో ఇదివరకే కోర్టు పలు మార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై దాఖలైన పిటిషన్లను విచారిస్తోన్న హైకోర్టు.. సోమవారం నాటి వాదనల్లో సర్కారు తీరును మరోసారి తప్పుపట్టింది. పదే పదే హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నారని, ఇదివరకే జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహించింది. కరోనా బులిటెన్ లో టెస్టులు, కేసుల వివరాలు సమగ్రంగా ఉండటం లేదన్న అభ్యంతరాలపై ఈ మేరకు హైకోర్టు విచారణ చేపట్టింది.

''ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టులు విరివిగా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రంతో పోల్చితే తెలంగాణ ఎంతో వెనుకబడి ఉంది. మా ఆదేశాలను ధిక్కరిస్తోన్న అధికారులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోకూడదు?'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీలో ఇప్పటికే 13లక్షల పైచిలుకు కరోనా టెస్టులు నిర్వహించగా, తెలంగాణలో ఆ సంఖ్య 3లక్షల లోపే ఉండటం గమనార్హం.
కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందంటూ బులిటెన్ లో పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ''ఓవైపు మేం మొట్టికాయలు వేస్తుంటే.. అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారు?'' అని కేసీఆర్ సర్కారును నిలదీసింది. ఆదివారం నాటికి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 45,076కు, మరణాల సంఖ్య 415కి పెరిగింది. కేసులతో పోల్చుకుంటే డెత్ రేటు ఒక శాతం లోపే ఉందని, కరోనా చర్యలపై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని అభినందించిందని బులిటెన్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications