మున్పిపల్ పోల్స్పై సీపీఎస్ సర్వే: మళ్లీ టీఆర్ఎస్దే హవా, ఆ పార్టీల ప్రభావం నామ మాత్రమే..
హైదరాబాద్: తెలంగాణాలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగినట్లు సీపీఎస్ సర్వే వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జోరు చూపించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సత్తా చాటిందని పేర్కొంది.

టీఆర్ఎస్ హవా..
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో జనవరి 22నే మున్సిపల్ ఎన్నికలు జరగగా.. శుక్రవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ సర్వే విడుదలైంది. తెలంగాణలోని 120 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 104-109 స్థానాల్లో గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోందని సీపీఎస్ సర్వే వెల్లడించింది.

చతికిలపడ్డ కాంగ్రెస్, బీజేపీలు..
కాంగ్రెస్ పార్టీ 0-4 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, బీజేపీ 0-2 స్థానాలు దక్కించుకునే అవకాశ ఉందని తెలిపింది. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఎంఐఎం 1 లేదా 2 మున్సిపాలిటీలను దక్కించుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

గతంలో సర్వే చెప్పినట్లుగానే..
కార్పొరేషన్లలో పదికి పది టీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉందని సీపీఎస్ సర్వే పేర్కొంది. 9-10 కార్పొరేషన్లను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 0-1 కార్పొరేషన్లో తన జెండా ఎగురవేసే ఛాన్స్ ఉందని సర్వే తేల్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎస్ సర్వే ఫలితాలు దాదాపుగా సరిపోలడంతో తాజాగా సర్వేకు ప్రాధాన్యత ఏర్పడింది.

రేపే ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
జనవరి 25న మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. కరీంనగర్ కార్పొరేషన్కు మాత్రం సోమవారం ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఫలితాల్లో ఎవరైనా అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే.. లాటరీ పద్ధతిలో విజేతను నిర్ణయించనున్నట్లు ఆయన తెలిపారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అధికార పార్టీ అభ్యర్థుల్లో కొంత విశ్వాసం ఉన్నప్పటికీ.. పోటీ చేసిన వారిలో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించిన విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications