వామ్మో.. కేటుగాళ్లు.. మణప్పురానికే టోకరా.. రూ.30 లక్షలు వసూల్
సైబర్ కేటుగాళ్లు ఎవరినీ వదలడం లేదు. ఆఖరికి మణప్పురం గోల్డ్ లోన్ సంస్థను కూడా ఛీట్ చేశారు. మణప్పురం గోల్డ్లోన్ సంస్ధ ఇటీవల డోర్స్టెప్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అవకాశంగా తీసుకున్నారు. సంస్ధ నుంచి రూ. 30 లక్షలు కాజేశారు. దీంతో మణప్పురం సంస్ధ దరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కస్టమర్స్ కోసం..
వినియోగదారుల సౌలభ్యం కోసం మణప్పురం గోల్డ్లోన్ సంస్ధ ఇటీవల డోర్స్టెప్ లోన్ స్కీంను ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో రుణం కావల్సిన వారు ఆన్లైన్లో కానీ, ఫోన్ ద్వారా కానీ రుణం కోసం అప్లయ్ చేసుకుంటారు. సంస్ధకు చెందిన వాల్యూయర్ ఆ చిరునామాకు వెళ్లి బంగారాన్ని సరి చూసి తన యూజర్ ఐడీ, పాస్వర్డ్తో మణప్పురం పోర్టల్లోకి లాగిన్ అయి వారి వివరాలు నమోదు చేస్తాడు. మరుసటి రోజు సంస్ధ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ ఇంటికి వచ్చివారికి మంజూరైన రుణాన్ని వారి ఖాతాలోకి బదిలీ చేసి బంగారం తీసుకుని వెళతాడు. ఈ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సైబర్ నేరగాళ్లు సంస్ధ నుంచి రూ. 30 లక్షలు తీసుకున్నారు.
రూ.30 లక్షలు ట్రాన్స్ ఫర్..
హిమాయత్ నగర్ బ్రాంచికి చెందిన వాల్యూయర్, ఎగ్జిక్యూటివ్ వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకున్నారు. జూన్ 15న మణప్పురం హెడ్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని వాల్యూయర్కి చెప్పారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ వర్క్ పోర్టల్లోకి అప్లోడ్ కావట్లేదంటూ చెప్పి వారి యూజర్నేమ్ పాస్వర్డ్ తీసుకున్నారు. ఆ రోజు ఎగ్జిక్యూటివ్కు ఫోన్ చేసి వాల్యూయర్కి చెప్పినట్లుగానే చెప్పి యూజర్నేమ్, పాస్వర్డ్ తీసుకున్నారు. దీని ఆధారంగా జూన్ 16న హిమయత్ నగర్కు చెందిన ఒక వ్యక్తి ఆన్లైన్లో లోన్ కోసం అప్లై చేసినట్టు చేశారు. తర్వాత వాల్యూయర్, ఎగ్జిక్యూటివ్ తమ పని పూర్తి చేసినట్లు చూపిస్తూ 1,210 గ్రాముల బంగారం ఉన్నట్లు రూ. 30 లక్షల రూపాయల రుణాన్ని ఒడిషాలోని ఓ బ్యాంకు ఖాతాలోకి ట్రాన్సఫర్ చేసుకున్నారు.
తనిఖీ చేయగా..
మణప్పురం సంస్ధ ఎప్పటికప్పుడు ముందు రోజు తమ సంస్ధలో జరిగిన లావాదేవీలను పరిశీలిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో జూన్ 17న బుధవారం జరిగిన లావాదేవీలను పరిశీలించింది. అందులో 1,210 గ్రాముల బంగారం లెక్క తక్కువ వచ్చింది. అంత మొత్తానికి రుణం మంజూరు చేసిన వాల్యూయర్, ఎగ్జిక్యూటివ్లను విచారించింది. దీంతో అసలు మోసం బయటపడింది.
పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు జరిపారు. మణప్పురం నుంచి వేరే ఖాతాలోకి వెళ్లిన నగదు ఒడిశాలోని బ్యాంకుకు చేరిందని తెలుసుకున్నారు. ఆ జు అక్కడి బ్యాంకు నుంచి నిందితులు డబ్బు డ్రా చేసి తీసుకువెళ్లినట్లు తేలింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.