హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్ చేరుకున్న ముకర్రం ఝా పార్థీవదేహం: కేసీఆర్ నివాళి
హైదరాబాద్: ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థీవ దేహం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్కు తీసుకొచ్చారు. అక్కడ్నుంచి చౌమహల్లా ప్యాలెస్కు తరలించారు. ఈరోజు నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే చూసేందుకు అనుమతిచ్చారు.
చౌమహల్లా ప్యాలెస్లోని ముకర్రం ఝా పార్థివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ముకర్రం ఝా భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు.
కాగా, బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ముకర్రం ఝా పార్థీవ దేహాన్ని చూసేందుకు నిజాం అభిమానులకు, ప్రజలకు అనుమతించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదు వరకు యాత్ర కొనసాగనుంది.
తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కనే ముకర్రం ఝా పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా బహదూర్ (మీర్ బరాకత్ అలీఖాన్) (89) శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్లోని ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకర్రం ఝా జన్మించారు. 1971 వరకు అధికారికంగా హైదరాబాద్ యువరాజుగా కొనసాగారు.