Shadnagar Encounter: ఎన్ కౌంటర్ లో కొత్త కోణం: తూటాల తూట్లతో మహ్మద్ ఆరిఫ్ మృతదేహం..!
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ పై పోలీసులు ఎక్కువ సార్లు కాల్పులు జరిపినట్లు తేలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

చటాన్ పల్లి ఫ్లైఓవర్ కిందే..
వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో మహ్మద్ ఆరిఫ్ పాషా సహా జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ నలుగురు కామాంధులు.. అదే చటాన్ పల్లి ఫ్లైఓవర్ కిందే దిశ మృతదేహాన్ని తగుల బెట్టారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం నిందితులను అక్కడికి తీసుకెళ్లగా వారు పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో ఎన్ కౌంటర్ చేశారు.

ఆరిఫ్ మృతదేహంపై నాలుగు చోట్ల బుల్లెట్ గాయాలు..
ఈ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులు ఎక్కువ సార్లు మహ్మద్ ఆరిఫ్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ హత్యోదంతంలో అతనే ప్రధాన నిందితుడు. అతని పేరును అక్యూస్డ్-1 (ఏ1)గా పేర్కొన్నారు. మహ్మద్ ఆరిఫ్ మృతదేహంపై నాలుగు చోట్ల బుల్లెట్ గాయాలు కనిపించినట్లు చెబుతున్నారు. మూడు బుల్లెట్లు నేరుగా ఛాతీలో దిగబడగా.. మరొకటి కుడివైపున పక్కటెముకలను చీల్చేసినట్లు తేలింది. పక్కటెముకలకు కాస్త దిగువన ఈ బుల్లెట్ గాయం కనిపించినట్లు తెలుస్తోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.

ముగ్గురి మృతదేహాలపై..
మహ్మద్ ఆరిఫ్ తో పోల్చుకుంటే.. మిగిలిన ముగ్గురి మృతదేహాలపై ఆ స్థాయిలో బుల్లెట్ల గాయాలు లేవని సమాచారం. జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు మృతదేహాలపై మూడు వరకు బుల్లెట్ గాయాలు కనిపించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా నేరుగా గుండెల్లోకే షూట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం వారి మృతదేహాలకు ఇంకా అంత్యక్రియలను నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ నాలుగు మృతదేహాలను కూడా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి మార్చురిలో ఉంచారు.












Click it and Unblock the Notifications