దొంగలా వచ్చి కాలేజ్కి ఫౌండేషన్ వేశారు.. హరీశ్ రావుపై డీకే అరుణ నిప్పులు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు అంటే వారికి లెక్కే లేదు అని ఫైరయ్యారు. పేదల ఇళ్ల కోసం గద్వాలలో సేకరించిన భూమిని ముట్టుకుంటే ఉసురు కొట్టుకుపోతారని మండిపడ్డారు. గద్వాల అభివృద్ధిపై మాట్లాడే అర్హత కేసీఆర్, హరీష్రావుకు లేదన్నారు. నర్సింగ్ కాలేజ్, ఆస్పత్రి నిర్మాణంపై మండిపడ్డారు. దానిని తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని ఆమె స్పష్టంచేశారు.
ఇళ్ల కోసం ఇచ్చిన భూములను సేకరించటానికి ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని అరుణ డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు గద్వాల పర్యటనలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నా అని చెప్పారు. బీజేపీ కార్యకర్త చెయ్యి విరగొట్టిన రూరల్ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీష్రావును లాఠీలతో కొడితే ఆ బాధేంటో వారికి తెలుస్తోందని చెప్పారు. అవగాహన లేకుండా మాట్లాడే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అరుణ అన్నారు.
తనపై వ్యక్తిగత కక్షతో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూములు గుంజుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. మంత్రి హరీష్రావు దొంగతనంగా గద్వాల వచ్చి నర్సింగ్ కాలేజ్కు ఫౌండేషన్ వేశారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భవనాల కోసం గజం భూమిని కూడా సేకరించలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. కొంతమంది పోలీసులు మానవత్వాన్ని కోల్పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై మాత్రం ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు.
గద్వాలలో 5 వేల మందికి ఇళ్లు ఇస్తామని తాను హామీ ఇవ్వలేదని లక్ష్మీనరసింహాస్వామిపై కేసీఆర్ ప్రమాణం చేయగలరా అని అరుణ ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అడిగినందుకు దాడులు చేయటం హేయనీయం అని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరి వ్యవహరిస్తున్నారని అరుణ ఫైరయ్యారు.పేదల ఇళ్ల కోసం 2012లో 78 ఎకరాల పట్టా భూమిని సేకరించి ప్రభుత్వానికి ఇచ్చామని డీకే అరుణ టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.