వీడియో కాల్ మాట్లాడుతూ మహిళకు ఆపరేషన్: వైద్యుల నిర్లక్షంతో బాలింత మృతి
హైదరాబాద్: ఎంతో బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన వైద్యులు, సిబ్బంది.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని బలి చేశారు. వీడియో కాల్ మాట్లాడుతూ ఆపరేషన్ చేయడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రిహిల్స్లోని నవభారత్నగర్కు చెందిన ఎం జానకి(23)కి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆగస్టు 28న ఉదయం శ్రీరామ్నగర్లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆగస్టు 29న అర్ధరాత్రి 2.30గంటలకు ఆస్పత్రిలోని వైద్యురాలు, మరో నర్సు, ఇతర సిబ్బంది సిజేరియన్ చేయగా మగబిడ్డ పుట్టాడు.

ఆ తర్వాత జానకి ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున 4.30 గంటలకు నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 30న ఉదయం జానకి మృతి చెందింది. కాగా, శస్త్రచికిత్స చేసిన సమయంలో వైద్యురాలు, ఓ నర్సు వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈ కారణంగానే ఆపరేషన్ వికటించి జానకి మృతి చెందిందని ఆరోపించారు.
ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులకు జానకి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కేసు నమదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. నిర్లక్ష్యంగా వ్యవహరించి నిండు ప్రాణం తీసిన సదరు వైద్య సిబ్బందిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications