బాబ్బాబు.. ఓటేశాక తాగు, పోలింగ్ కు ముందు మందొద్దు.. ప్రాధేయపడుతున్న అభ్యర్థులు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బరిలో నిలిచిన అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నేతలు బుధవారం సాయంత్రంతో ఎన్నికల కోడ్ తెరపైకి రావడంతో కాస్తా ఊపిరి పీల్చుకుందామనుకున్నారు. కానీ ఎన్నికల సంఘం రూల్ తో మళ్లీ అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల రంగంలోకి దిగిన అభ్యర్థులు పోలింగ్ అయ్యేంతవరకు ఓటర్లను కనిపెట్టుకుని చూడాల్సిన పరిస్థితి.
తాగి వస్తే ఓటు వేయనివ్వబోమని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఎలక్షన్లను సజావుగా, సాఫీగా సాగాలంటే ఇలాంటి నిబంధనలు తప్పవేమో మరి. అయితే ఈ రూల్ ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది.
తాగొస్తే ఓటు లేనట్లే..! అభ్యర్థుల్లో కలవరం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల సంఘం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. ఈక్రమలో పోలింగ్ సజావుగా జరిగేలా కొన్ని నిబంధనలు విధించింది. తాగి వస్తే ఓటు వేయనివ్వమనేది అందులో ఒక రూల్. దీంతో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారట. ఈసీ రూల్ తెలియక కొందరు ఓటర్లు తాగి వస్తే అసలుకే ఎసరు వస్తుందని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో ఖర్చు పెట్టి ఇంతదాకా వచ్చాక ఓట్లు పడకుంటే నష్టపోతామని బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే "బాబ్బాబు.. ఓటేశాక ఎంత కావాలంటే అంత తాగు" - కానీ "ఓటుకు ముందు మందు ముట్టకు" అంటూ కొంతమందిని నియమించి ఓటర్లను ప్రత్యేకంగా కలుసుకుని ఈవిధంగా ప్రాధేయపడేలా ప్లాన్ చేశారట.
ఏరులై పారుతున్న మద్యం..
ఎలక్షన్ కోడ్ లో భాగంగా పోలింగ్ తేది అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడా కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల దాకా మద్యం ఏరులై పారుతోంది. ఎలక్షన్ కోడ్ తో లిక్కర్ షాపులు బందుంటాయని ముందే తెలిసిన అభ్యర్థులు భారీ స్థాయిలో మందు స్టాక్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల రెండు మూడు రోజులకు సంబంధించిన కోటా ఒకేసారి ఇచ్చేసి జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారట. ఈనేపథ్యంలో తాగొస్తే ఓటు వేయనివ్వబోమనే ఈసీ నిబంధన అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. అందుకే మందు సప్లై చేసిన కూడా ఓటర్లను కాపాడుకోవాలని తెగ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. అందుకే "ఓటు వేశాక మాత్రమే తాగండి" అంటూ అభ్యర్థిస్తున్నారట.
మందు ముట్టకుండా స్పెషల్ ఏర్పాట్లు
నామినేషన్ మొదలు ప్రచారం ముగిసి పోలింగ్ సమయం వరకు పోటీలో నిలిచిన అభ్యర్థుల టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇక ప్రచారంలోనైతే చెప్పనక్కర్లేదు. తమ వెంట తిరిగే అనుచరులు మొదలు బూతుల వారీగా చోటామోటా నేతలు, ఓటర్లు ఇలా అందరికీ మందు సప్లై చేస్తారనేది బహిరంగ రహస్యం. కేవలం లిక్కర్ కోసమే లక్షలాది రూపాయలు ఖర్చవుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే అంత ఖర్చు పెట్టి తీరా ఓట్ల దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్సయితే ఎట్లా అనేది అభ్యర్థుల టెన్షన్. ఇన్నిరోజులు అలా అందర్నీ కాపాడుకుని వచ్చి.. తీరా పోలింగ్ లో తేడా కొడితే ఎట్లా అని మధనపడుతున్నారట. అందుకే పోలింగ్ ముగిసేంతవరకు ఓటర్లు మందు ముట్టకుండా చూసేలా కొందర్ని స్పెషల్ గా అపాయింట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.