క్యాసినో కేసు: ఎల్ రమణకు ఈడీ నోటీసులు, చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా
క్యాసినో కేసులో ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు నోటీసులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్న చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.
కీలక నిందితుడిగా ఉన్న చికోటి ప్రవీణ్ కుమార్ను పలుమార్లు ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్పై విచారణ చేపట్టారు. మనీలాండరింగ్ వ్యవహారంలో వీరిపై ప్రశ్నలు వేశారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. గత నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
చికొటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినో ఆడించినట్టు అధికారులు గుర్తించారు. మనీ ల్యాండరింగ్, లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని అంటున్నారు. తలసాని సోదరులు మహేష్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ను పిలిచి ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. చికోటి ప్రవీణ్తో కలిసి ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడినట్లుగా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. చికోటి ప్రవీణ్ జరిపిన లావాదేవీల్లో మహేష్, ధర్మేందర్ యాదవ్ పేర్లు రావడంతో అధికారులు వారిని పిలిచి విచారణ చేపట్టారు.
హవాలా, ఫేమా ఉల్లంఘన కింద ఇద్దరినీ విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో చాలామందిని విచారణకు పిలిచారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను పిలవడం చర్చనీయాంశం అయ్యింది.