తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. తక్కువ పరీక్షల వల్లేనా.. ఈటెల రియాక్షన్ ఏంటి..?
తెలంగాణలో మంగళవారం(ఏప్రిల్ 28) కొత్తగా మరో 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇందులో 25 మంది మృతి చెందారు. మంగళవారం డిశ్చార్జి కానున్న 42 మందితో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా 374 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాజా ప్రెస్ మీట్లో ఈ వివరాలను వెల్లడించారు.
కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న ఈటెల
రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ఈటెల అన్నారు. ప్రతీరోజూ సింగిల్ డిజిట్లోనే కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు. కేసులు సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలి.. దేనిపై ఫోకస్ పెట్టాలనే అంశంపై చర్చించినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 7 వరకు లాక్ డౌన్ కచ్చితంగా కొనసాగుతుందని సీఎం చెప్పారన్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం,దాని అనుబంధ రంగాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పినట్టుగా తెలిపారు.
50శాతానికి పైగా హైదరాబాద్లోనే..
ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో 50శాతానికి పైగా జీహెచ్ఎంసీలోనే నమోదయ్యాయని ఈటెల తెలిపారు. ఆ తర్వాత వికారాబాద్,గద్వాల,సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు. నిజామాబాద్,వరంగల్,కరీంనగర్,నిర్మల్లోనూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ వారిలో చాలామంది డిశ్చార్జి అయినట్టు పేర్కొన్నారు. గత 14 రోజులుగా ఏయే జిల్లాల్లో అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదో.. అలాగే ఏయే జిల్లాల్లో అయితే ఒకటి,రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయో.. అవన్నీ గ్రీన్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. దేశమంతా కేసులు పెరుగుతుంటే... తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసంతో ఉందని.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారని అన్నారు.
అందులో నిజం లేదన్న మంత్రి..
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడానికి పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటమే కారణమన్న విమర్శలపై ఈటెల స్పందించారు. రాష్ట్రంలో తక్కువ వైద్య పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేంద్రం, ఐసీఎంఆర్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తెలంగాణలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉందని గుర్తుచేశారు. మొదట్లో ర్యాపిడ్ టెస్ట్లు చేయాలన్న ఐసీఎంఆర్ తరువాత దాన్ని విరమించుకుందన్నారు. ఇటీవల పలు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను వెనక్కి పంపించాలని ఐసీఎంఆర్ కోరిందని ఆయన గుర్తు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వ కృషిని విదేశాల్లోని వారు కూడా అభినందిస్తున్నారని చెప్పారు.
Recommended Video
లక్షణాలు ఉంటేనే..
కరోనా మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా 7శాతం ఉంటే.. దేశంలో 3.2శాతం ఉందన్నారు. తెలంగాణలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉందన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ చెప్పిందని.. కాబట్టి లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.లాక్డౌన్ను పక్కాగా అమలు చేయడం వల్లే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదన్నారు.