పోలీసుల నిర్లక్ష్యం: మాజీ భార్యని చంపడానికి వేటకొడవలితో హంగామా చేసిన ఉన్మాది పరార్..!!
హైదరాబాద్ : విశ్వనగరం, ఐటీ హబ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గొప్పలు చెప్పుకుంటారు. భుజాలు చరుచుకుంటారు. కానీ వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధం. భాగ్యనగర నడిబొడ్డున ఓ వివాహితకు భద్రత కరువైంది. తాను పెళ్లి చేసుకున్న భర్తే యముడిలా వెంటాడటంతో ఆమె రక్షణ కోసం ఖాకీలను ఆశ్రయించింది. అయితే వివాహిత ఖాకీలకు కంప్లైంట్ చేయడం, శాడిస్ట్ భర్త వేదించడం కామనైపోయింది. కానీ వాడి నరనరాన అనుమానం అనే విషపురుగు పెరిగి పెద్దదై .. తన మాజీ భార్యను మట్టుబెట్టాలని తిరగడంతో ఆ వివాహిత భయాందోళనకు గురైంది.
ముణ్నాళ్ల మురిపెం ..
బండ్లగూడకు చెందిన లావణ్యను సాయికిరణ్తో పెళ్లైంది. ఆరునెలలు కాపురం సజావుగా సాగింది. తర్వాతే విశ్వరూపం చూపించాడు. అనుమానం పేరుతో వేధించడం ప్రారంభించాడు. రోజు తాగొచ్చి తిడుతూ, కొట్టడంతో కొన్నాళ్లు భరించింది. తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పుట్టింటికి రమ్మన్నారు. దీంతో ఆమె వెళ్లిపోయింది. దీంతో సాయికిరణ్లో ఉన్మాదం పీక్ స్టేజీకి చేరింది. అప్పటినుంచి లావణ్యకు వేధిస్తూనే ఉన్నారు. దీంతో అతనితో పడలేదని విడాకులు కూడా ఇచ్చింది. చట్టపరంగా విడాకులు తీసుకున్నారు .. కానీ వేధింపులు మాత్రం తప్పలేదు.
తప్పని వేధింపులు ..
భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న .. ఆమె ఉండే ప్రాంతం పసిగట్టి మరీ అక్కడికి వాలిపోతున్నాడు సాయి కిరణ్. ఈ క్రమంలో గతంలో ఓసారి హత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఆరు నెలల తర్వాత బయటకొచ్చిన సాయికిరణ్ .. లావణ్యను వేధించడం మాత్రం ఆపలేదు. అతని బారినుంచి తప్పించుకునేందుకు లావణ్య సిటీలో ప్లేస్ మారుస్తూ వస్తోంది. కానీ పసిగడుతూ అక్కడికి వస్తూ టార్చర్ మాత్రం చేస్తున్నాడు. ఈ నెల 9న కొడవలితో దాడిచేసేందుకు ప్రయత్నించడంతో మళ్లీ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పించుకుంది. అయితే పోలీసులకు కళ్లు గప్పి ఇవాళ మరోసారి దాడిచేయబోయాడు. మరోసారి అతడిని అదుపులోకి తీసుకుని .. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో ఆమె తనకు సాయికిరణ్తో ప్రాణహాని ఉందని వణికిపోతుంది.
ఇవీ ఫిర్యాదులు ..
సాయికిరణ్ వేధింపులపై లావన్య జూబ్లీహిల్స్, మొయినాబాద్, నర్సింగ్, రెహమత్ నగర్, రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కానీ ఆమెకు వారు పూర్తి రక్షణ కల్పించలేకపోయారు. ఎప్పడు, ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాడనే భయం వెంటాడుతుంది. గతంలో ఓసారి హత్యాయత్నానికి సంబంధించి, తాజాగా కొడవలితో దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా వాటి సంగతేంటని లావణ్య ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కిరణ్ గురించి పోలీసు కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారే .. కానీ ఏ చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు.
లావణ్య గోడు పట్టదా ..
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, షీ టీమ్స్ ఏర్పాటు చేశామని గొప్పులు చెప్పుకునే పోలీసులు, పొలిటిషియన్లకు లావణ్య ఉదంతం కళ్లకు కనిపించడం లేదా ? తన మాజీ భర్త నగర నడిబొడ్డున కత్తి పట్టుకొని తిరిగితే ఏం చేస్తున్నారు. ఆమె ఉంటున్న స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, 100కి డయల్ చేయడంతో సరిపోతుంది. ఐదారు పీఎస్లలో ఫిర్యాదు చేస్తే రెండు కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి విచారణ లేదు, అతనికి శిక్ష లేదు. అంటే ఓ వివాహిత పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న వైఖరి దేనికి సంకేతం అని సగటు పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తమ దృష్టికి రాలేదు, కంప్లైంట్ ఇవ్వలేదని పోలీసు పెద్దలు చెప్తున్నారు. మరీ లావణ్య ఫిర్యాదు మీకు పట్టదా ? ఆమెకు రక్షణ కల్పించర ? సగటు వివాహిత భద్రతపై మీకెందుకు నిర్లక్ష్యం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మాజీ భర్త వేట కొడవలి పట్టుకొని దర్జాగా వస్తే .. పోలీసులు ఏం చేస్తున్నారని పౌరసమాజం ప్రశ్నిస్తోంది. యువత గొంతెత్తి నిలదీస్తోంది. ఇప్పటికైనా మేల్కొని లావణ్యకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. జరగరానిది ఏదైనా జరిగితే దానికి మన విశ్వనగర పోలీసులే బాధ్యత వహించాలంటున్నారు ప్రజాసంఘాల నేతలు.