ట్రాన్స్పోర్టులో పేలుడు పదార్థాలు.. పోలీసులకు సమాచారం.. ఏం జరిగిందంటే..
హైదరాబాద్లో పేలుడు పదార్థాలు కలకలం రేపాయిం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గల వనస్థలిపురంలో పేలుడు పదార్థాలు కనిపించాయి. వనస్థలిపురం నవతా ట్రాన్స్పోర్టులో ఇటీవల వచ్చిన ఓ కొరియర్ పార్సెల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయి. 8 కార్టన్లలో పేలుడు పదార్థాలు కనిపించాయి. ఇవీ చిలకలూరిపేట నుంచి పుణెకు పార్సిల్ చేయబడ్డాయి. మార్చి 15వ తేదీన హైదరాబాద్కు కొరియర్ చేరుకోగా ట్రాన్స్పోర్టు సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం వాటిని పరిశీలించారు.
8 కార్టన్లలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పేలుడు పదార్థాలు సినిమాల్లో వాడే బాంబులుగా నిర్ధారించారు. మొత్తం 8 కార్టన్లలో సుమారు 100 బాంబులు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే పేలుడు పదార్ధాలు తరలింపుకు లైసెన్స్ ఉందా? ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరి పేరుపై ఉన్నాయి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఈ ఘటన మాత్రం కలకలం రేపింది. నయం ఆ పేలుడు పదార్థాలు అలానే ఉన్నాయి. ఏ మాత్రం పేలలే.. లేదంటే మరోలా ఉండేది. అయితే సినిమాల్లో వాడేవి అని చెప్పడంతో ఆ స్థాయిలో నష్టం ఉండదని మరికొందరు అంటున్నారు.