ప్రమాదంలో ఫెడరలిజం: కేంద్రం, బీజేపీపై కేసీఆర్ నిప్పులు, ఉక్రెయిన్ రిటర్నీ, వారికి గుడ్న్యూస్
హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ మంగళవారం సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బిల్లుపై చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానమిస్తూ మాట్లాడారు. రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ మండిపడ్డారు.

ప్రమాదంలో ఫెడరలిజం: కేంద్రం, బీజేపీపై కేసీఆర్ నిప్పులు
దేశంలో ఫెడరలిజం ప్రమాదంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. అధికార, ప్రతిపక్షం అనే భేదాభిప్రాయాలు లేకుండా ఫెడరల్ స్ఫూర్తిపై చర్చ చేయాలన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో రాష్ట్రాల హక్కులు కాల రాస్తుందని కేంద్రంపై మండిపడ్డారు. సివిల్ సర్వీసు అధికారులను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుందని కేసీఆర్ ఆరోపించారు. ఓట్లు..సీట్లు లెక్క పెట్టుకోవడమే రాజకీయం కాదని, ప్రేమ పూర్వక దేశంలో విషబీజాలు నాటుతున్నారని కేంద్రం, బీజేపీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తామన్న చర్యలు కేంద్రం చేపడుతోందని ఆరోపించారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు అనే నినాదం అందుకున్నారని అన్నారు. ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేక చర్య ఇదన్నారు.

ఉన్మాద చర్యలంటూ కేంద్రంపై కేసీఆర్ విమర్శలు
మత పిచ్చిని రెచ్చగొడుతున్నారని సీఎం కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. ప్రస్తుతం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం దోరణి ఉందన్నారు. కేంద్రం పనితీరు తెలంగాణకంటే దిగజారిపోయిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న యూపీ కంటే తెలంగాణే అభివృద్ధిలో ముందుందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం కూడా అప్పులు చేసిందని చెప్పారు. అప్పులు చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని అన్నారు. అప్పులను వనరుల సమీకరణగా పరిగణిస్తారని కేసీఆర్ చెప్పారు. ఇక, బెంగుళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఐటీ లో రెండో ప్లేస్ లో ఉన్నాం, ఫార్మాకి ఫేమస్ హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మత కలహాలు పెట్టి హిజాబ్ పంచాయతీ పెట్టారని, ఆహార అలవాట్ల మీద పంచాయతీ, ప్రభుత్వంకి వీటి మీద సంబంధం ఏంటి..? అని ప్రశ్నించారు. సంకుచిత ఆలోచన చేస్తే దేశం ఏమవుతుందని, ఉన్మాద చర్య ఇది అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. అనేక వ్యయ ప్రయాసాల మీద నిలబడ్డ దేశం ఏం అవుతుందని ప్రశ్నించారు. యూపీఏ మీద రకరకాల నిందలు మోపి... ఇప్పుడున్న ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందన్నారు. ప్రజల పరిస్థితి ఇప్పుడు గొప్పగా ఏమీ లేదన్నారు.
Recommended Video

ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉక్రెయిన్ రిటర్న్ విద్యార్థులకు కేసీఆర్ గుడ్న్యూస్
కాగా, తెలంగాణ ప్రాంతం నుంచి ఉక్రెయిన్కు 700 మందికి పైగా విద్యార్థులు వెళ్లారని.. అందరూ డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ దేశానికి వెళ్లారని.. ఇక్కడ వసతి లేదు కాబట్టి ఆ దేశం పోయారని గుర్తుచేశారు సీఎం కేసీఆర్. అంతేగాక, అక్కడ ఫీజులు తక్కువనే వెళ్లారని చెప్పారు. ఇక, ఉక్రెయిన్ నుంచి వచ్చిన మా పిల్లల చదువులకు ఎంత ఖర్చు అయినా సరే మేమే (తెలంగాణ ప్రభుత్వం) భరిస్తుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు కేసీఆర్. ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న వారి ఖర్చు భరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదువు పూర్తి అయ్యేందుకు వారికి సహకరిస్తామని తెలిపారు కేసీఆర్. ఇది ఇలావుండగా, ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం తీపికబురు చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెలాంటి పొరపాటు చేయొద్దని, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సెర్చ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామన్నారు.












Click it and Unblock the Notifications