ప్లాట్ ఫాం ధర వాత.. సంక్రాంతి ఫెస్టివ్ సందర్భంగా 50 శాతం హై..
సంక్రాంతి వచ్చేస్తోంది.. దీంతో బస్సులు, రైళ్లు నిండిపోతున్నాయి. టికెట్ల బాదుడు షరామములే.. పండగ దృష్ట్యా ప్లాట్ ఫాం టికెట్ ధర కూడా పెంచేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 8 నుంచి 20 తేదీ వరకు పెంచిన రైల్వే ప్లాట్ఫాం చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తారు. ప్రస్తుతం ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా.. దానిని 20 చేసింది.
పెరిగిన ధర
ప్లాట్ఫాం టికెట్ ధరను పెంచామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జన సమూహం ప్లాట్ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు.
బస్సులు
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పండుగ కోసం 6,970 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇక టికెట్ ధరను 50 శాతం వరకు పెంచింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే టికెట్ ధర రూ.350 నుంచి రూ.500వరకు ఉంటుంది. సంక్రాంతి సమయంలో బస్సును బట్టి టికెట్ ధర రూ.750 నుంచి రూ.1100 వరకు ఉంటుంది. ఇక తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సంక్రాంతికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు 3వేల 334 స్పెషల్ బస్సులను నడపనుంది. ఇక ఏపీకి మరో 984 సర్వీసులు తిప్పనుంది. పండుగకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
స్పెషల్ సర్వీస్
ఇటు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో గల వివిధ పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో టీఎస్ఆర్టీసీ 4 వేల 980 బస్సులు నడపగా.. ఈ ఏడాది 4 వేల 318 బస్సులను నడిపుతున్నామని ప్రకటించింది. బస్సులను హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్, జీడిమెట్ల, జేబీఎస్, ఈసీఐఎల్ నుంచి నడుపున్నట్లు వెల్లడించింది.
నో ఎక్స్ట్రా చార్జెస్
గతంలో సంక్రాంతికి బస్సులు ఎక్కువ రేటుతో నడిచేవి. ఇప్పుడు మాత్రం ఎలాంటి అదనపు వసూళ్లు లేకుండా బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ బస్సులను అదనంగా ఏర్పాటు చేయగా.. వాటికి రిజర్వేషన్ ఉంటుందని అధికారులు చెప్పారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ బయట ఉన్న ఓల్డ్ సీబీఎస్ హాంగర్ నుంచి బయలుదేరతాయి. సంక్రాంతికి నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై అదనపు చార్జీలు వసూలు చేస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. ఏపీకి వెళ్లేవారు తెలంగాణ బస్సులు ఎక్కేలా ప్లాన్ చేస్తుంది.