విషాదం: సాయం కోసం వస్తే కుప్పకూలిన మహిళ: 3 గంటలు నిల్చొని తిరిగిరాని లోకాలకు..
ఇటీవల హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సంతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రూ.10 వేల పరిహారం అందజేస్తామని చెప్పడంతో బాధితులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో కొన్నిచోట్ల తొక్కిసలాట జరుగుతోంది. అయితే హైదరాబాద్ శివారు గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ మృతిచెందారు. లైన్లో నిల్చొని.. అలానే కుప్పకూలిపోయింది.

జనమే జనం..
గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ-సేవ కేంద్రం వద్ద జనం బారులు తీరారు. వరదలకు సంబంధించి నష్ట పరిహారం దరఖాస్తు కోసం గుమిగూడారు. అక్కడికి హకీంపేట కుంటకు చెందిన మున్నవర్ ఉనిస (50) వచ్చారు. ప్రభుత్వం అందజేసే సాయం తీసుకుందామని అనుకున్నారు. తన ఇంటికి మరమ్మతులు చేయొచ్చని భావించారు. అలా ఎండలో మూడు గంటలపాటు నిల్చొని ఉన్నారు. అలసిపోయి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఉనిస చనిపోయారని వైద్యులు ధృవీకరించారు.

మీరే దిక్కు..
ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వ అందజేసే సాయం కోసం వస్తే.. ఉనిస చనిపోయారని రోదిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. వారి రోదనలు ప్రతీ ఒక్కరినీ కదలించాయి. ఇవాళ్టి నుంచి జీహెచ్ఎంసీ నామినేషన్ల పర్వం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉనిస చనిపోవడంతో.. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సర్వర్ డౌన్
ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులుతీరి కనిపిస్తున్నారు. దీంతో సమీప ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కొన్ని చోట్ల సర్వర్ డౌన్ సమస్య వేధిస్తోంది. కొందరు నగర శివారులో గల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కూడా వచ్చి మరీ ఆప్లై చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందజేసేదీ రూ.10 వేలు అయినా.. ఆ మేరకు కష్టపడాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications