గాంధీ ఆసుపత్రిలో ఘోరం : ఒక మహిళకి చేయాల్సిన డెలివరీ మరొకరికి.. ఆమె పరిస్థితి విషమం
గాంధీ ఆసుపత్రిలో మరో నిర్లక్ష్య ఘటన బయటపడింది. ఒక గర్భిణీకి చేయాల్సిన డెలివరీ మరో గర్భిణీకి చేయడంతో శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన సమతకు బ్లడ్ ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నాయని అక్కడి ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు చెప్పారు. సమతది ఓ పాజిటివ్ కావడంతో.. అక్కడ బ్లడ్ కొరత కారణంగా సికింద్రాబాద్ గాంధీకి పంపించారు. దీంతో అక్కడినుంచి ఈ నెల 11వ తేదీ రాత్రి 9గంటల ప్రాంతంలో సమత భర్త ఆమెను గాంధీని తీసుకొచ్చాడు.
సమతను ఆసుపత్రి వార్డులో చేర్పించాక.. ఆమె భర్త ఓ పాజిటివ్ బ్లడ్ కోసం బ్లడ్ బ్యాంకుకు వెళ్లాడు. ఆయన తిరిగొచ్చేసరికే సమతను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి డెలివరీ చేశారు. ఆ తర్వాత మరుసటిరోజు సాయంత్రం వరకు ఆమె భర్తను,కుటుంబ సభ్యులను లోపలికి అనుమతించలేదు. చివరకు మగ శిశువు పుట్టి చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో సమత భర్త,ఆమె కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. నెలలు నిండని తన భార్యకు డెలివరీ ఎందుకు చేశారని ప్రశ్నిస్తూ ఆమె భర్త చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Recommended Video
భవానీ అనే తొమ్మిది నెలల గర్భిణికి చేయాల్సిన డెలివరీ ఆపరేషన్ను సమతకు చేశారని ఆమె భర్త ఆరోపించారు. కే షీట్ ఫాలో అవకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. దీనిపై ఆసుపత్రి అధికారులను ప్రశ్నిస్తే.. నర్సు నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారన్నారు. సమత చేతికి భవానీ అనే ట్యాగ్ వేశారని చెప్పారు. తమకు పుట్టింది ఆడపిల్ల అయితే మగబిడ్డ అని చెప్పారన్నారు. తప్పుడు రిపోర్టులతో తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం సమత పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. చికిత్స వికటించడంతో ఆమె శరీరం రియాక్షన్కు గురవుతోందని.. ఏం జరుగుతుందోనని చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.