జీహెచ్ఎంసీ సమయస్పూర్తి.!ముమ్మరంగా వరద సహాయక చర్యలు.!ఐనా తప్పని ప్రజాగ్రహం.!
హైదరాబాద్ : నగరంలో అకాల వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నగర పాలక సంస్ధ అప్రమత్తమైంది. ముంపుకు గురైన ప్రాంతాలతో పాటు, విరిగి పడిన చెట్లను తొలగించే చర్యలను బల్దియా అధికారులు ముమ్మరంగా చేపట్టారు. జోనల్ కమిషనర్ల అధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ శానిటేషన్, ఇంజనీరింగ్ , యుబిడి, డిఆర్.ఎఫ్, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అకాల వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడ్డ ముంపు నీటిని తక్షణం తొలగించారు అధికారులు. ఐనప్పటికి నగర పాలక సంస్థ పనితీరుపైన ప్రజలు ఆగ్యహం వ్యక్తం చేసారు. అంతే కాకుండా, నాలాల తక్షణ మరమత్తులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు.
ఈ ఆదేశాల మేరకు నగరంలో కురిసిన అకాల వర్షాలకు వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఇంచార్జి జిహెచ్ఎంసి కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ జోనల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగర పాలక సంస్ధ సిబ్బంది పెద్ద మొత్తంలో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాలు, విరిగిన చెట్లను తొలగింపు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టి నివేదిక అందజేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జోనల్ కమిషనర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్ డి.ఆర్.ఎఫ్, యుబిడి అధికారులు సిబ్బంది సమన్వయంతో ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టారు. సికింద్రాబాద్ జోన్ లో జోనల్ కమిషనర్, డి సి లు, ఇంజనీరింగ్ శానిటేషన్, ఎన్ఫోర్స్మెంట్, డి.ఆర్.ఎఫ్ విభాగం అధికారులు సిబ్బంది కలిసి వరద ముంపును పెద్ద ఎత్తున తొలగించారు. 156 మంది సిబ్బందితో 32 బృందాలుగా ఏర్పడి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.