GHMC Elections 2020:ఎవరి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు సార్.. అమిత్ షాకు కేటీఆర్ సవాల్
హైదరాబాదు: తెలంగాణ వచ్చిన కొత్తలో హైదరాబాద్లో రకరకాల విషప్రచారాలు కొందరు చేశారని అన్నారు మంత్రి కేటీఆర్. అప్పట్లో తాగు నీటి సమస్య ఉండేదని అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యకు చెక్ పెట్టిందని గుర్తుచేశారు. ఇక అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంటు ఉండదని చెప్పారని అయితే ఈ రోజు పరిస్థితి కరెంటు పోతే వార్త అవుతోందని చెప్పారు. నాడు కరెంటు ఉంటే వార్తల్లో నిలిచేదని... ఇప్పుడు కరెంటు పోతే వార్తగా నిలుస్తోందని కేటీఆర్ అన్నారు.

శాంతి భద్రతలకు కేరాఫ్గా హైదరాబాదు
తాగునీటి సమస్య తీర్చేందుకు కేసీఆర్ పనిచేస్తున్నారని అందులో భాగంగానే శామీర్పేట్ వద్ద కేశ్వాపూర్ వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. శాంతిభద్రతలకు హైదరాబాదు కేరాఫ్గా నిలిచిందని చెప్పిన కేటీఆర్... అమ్మాయిలకు భద్రత ఉందని, ఆకతాయిలా ఆగడాలు లేవని, పోకిరీల పంచాయితీలు లేవని చెప్పారు. ఇక హైదరాబాదులో గత ఆరేళ్లలో ఒక్క బాంబు పేలుడు కూడా జరగలేదని చెప్పారు. శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అమెజాన్, గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు ముంబై, బెంగళూరుకు వెళ్లకుండా హైదరాబాదుకు వచ్చాయంటే ఇందుకు కారణం ఇక్కడ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ ఉండటమే అని కేటీఆర్ చెప్పారు.

పక్కా లోకల్ పార్టీ టీఆర్ఎస్
ప్రధాని మోడీ కొత్తగా వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఇస్తున్నారని... అయితే పక్కా లోకల్ పార్టీ టీఆర్ఎస్ అని చెప్పినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కరోనా వచ్చినా, వరదలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల మధ్య ఉన్నిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆరేళ్లలో పన్నుల రూపంలో 2లక్షల కోట్ల రూపాయలు కేంద్రంకు కడితే అర్థరూపాయి వాపస్ వచ్చిందని మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణ పైసలే ఇతర రాష్ట్రాలకు వినియోగిస్తున్నారని నేరుగా అమిత్షాకే ఎల్బీనగర్ వేదికగా చెప్పారు కేటీఆర్.
Recommended Video

విషయం లేని నాయకులు విష ప్రచారం
విషయం లేని నాయకులే విష ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ బీజేపీపై దుమ్మెత్తి పోశారు. కేసీఆర్ మనస్సు చాలా పెద్దదని 20వేల లీటర్ల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పారు ఇలాంటి పథకాలు మరిన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పారు కేటీఆర్. ఇక బీజేపీ మత ఘర్షణలకు తెరదీస్తోందని నిప్పులు చెరిగిన కేటీఆర్... హైదరాబాదుకు కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తే కట్టొద్దని బీజేపీ నాయకులు పిలుపునిస్తున్నారని.. యువత రాంగ్ రూట్లో వెళ్లాలని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications