మీకు మీరే...మాకు మేమే: బీజేపీ ఎంపీపై భగ్గుమన్న తెలంగాణ జనసేన: పొత్తు ఉంటుందా పోతుందా..?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ జనసేన-బీజేపీల మధ్య ఒక్కింత మాటల యుద్ధం నడుస్తోంది. నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పవన్ కళ్యాణ్, జనసేనపై చేసిన వ్యాఖ్యలతో జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నాయకుడిని, జనసేన పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని చెబుతూ... వెంటనే ధర్మపురి అరవింద్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఎంపీ అరవింద్ పై జనసేన అసంతృప్తి
గ్రేటర్ ఎన్నికల వేళ జనసేన బీజేపీల మధ్య పొత్తు బెడిసికొట్టేలా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జనసేన మద్దతు కోరలేదంటూ బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు మండిపడ్డారు. బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరిని విషయం బహుశా అరవింద్కు తెలియదేమో అని తెలంగాణ జనసేన ఇంఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ అన్నారు. ఒకవేళ తెలియకుంటే వీడియోలు చూసి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు.
బీజేపీ కోరితేనే మద్దతు ఇస్తున్నాం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ అభ్యర్థులను నిలిపిందని అందులో కొందరు నామినేషన్ కూడా వేశారని... అయితే ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకులు కోరితే ఓట్లు చీలకూడదన్న మంచి ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని అరవింద్ గుర్తెరగాలని సూచించారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడంతో కాస్త నిరాశకు గురైనప్పటికీ అధ్యక్షుడి మాట జవదాటకూడదని నిర్ణయించుకున్నారని శంకర్ గౌడ్ తెలిపారు.

జనసేన క్యాడర్ మనోభావాలను దెబ్బతీయకండి
ఇక పవన్ ఆదేశాల మేరకు క్యాడర్ బీజేపీకి మద్దతు తెలుపుతూ ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తున్నారని అదే సమయంలో బైకు ర్యాలీలు కూడా తీస్తున్నారని జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి సమయంలో పసలేని వ్యాఖ్యలు చేసి క్యాడర్ మనోభావాలను దెబ్బతీయడం సరికాదని సలహా ఇచ్చారు. అరవింద్కు తెలియకపోతే వీడియోలను చూసి ఆ పై మాట్లాడితే బాగుంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. అరవింద్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

జనసేనాని పై అరవింద్ ఏమన్నారంటే
ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరవింద్ జనసేన బీజేపీ మైత్రిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లలేదని, జనసేన అధినేతే బీజేపీ దగ్గరకు వచ్చారని అరవింద్ చెప్పారు. సినిమా స్టార్గా పవన్ కళ్యాణ్ను అభిమానిస్తానని చెప్పిన అరవింద్... రాజకీయాల్లో మాత్రం పవన్ పార్టీని మిత్రపక్షంగానే చూస్తామన్నారు. ఇక ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వారిని బీజేపీ పార్టీ ఆహ్వానించలేదని వారే మోడీ పాలనపై ఆకర్షితులై బీజేపీలో చేరారని చెబుతూ... దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కత్తి కార్తీక, మాజీ మేయర్ బండ కార్తీక, సర్వే సత్యనారాయణ లాంటి పేర్లను ప్రస్తావించారు.
Recommended Video

జనసేన ఓట్లు బీజేపీకి బదిలీ అవుతాయా..?
ఇక బీజేపీలో కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.పోలింగ్కు మరో కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా... బీజేపీకి జనసేన ఓట్లు బదిలీ అవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పాలనా పరంగా ఏమైనా తప్పులు ఉంటే వాటిపైన విమర్శలు చేయొచ్చు కానీ, విద్వేశాలను రెచ్చగొట్టడం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అరవింద్ వ్యాఖ్యలపై జనసేన నేతలు ఇచ్చిన వివరణతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందా లేక బెడిసికొడుతుందా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications