ఆ ఒక్కమాటతో మేయర్ ప్రతిష్ట మూసీలోకి -‘వర్షాలు కాదురా నాయనా.. వరదలు’ అంటూ డ్యామేజ్ కంట్రోల్
రాజకీయాలకు అతీతంగా తెలుగువారంంతా గౌరవించే కేశవరావు(కేకే) కూతురిగా.. కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలున్నా, అమెరికా పౌరసత్వాన్ని కూడా వదిలేసుకుని ఇండియా తిరిగొచ్చేసిన మహిళగా.. రెండు తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కు ప్రధమ పౌరురాలిగా.. పదవి చేపడుతూనే తప్పు చేసిన సొంత అనుచరులను శిక్షించి జనం ప్రశంసలు పొందిన నేతగా.. గద్వాల విజయలక్ష్మి సాధించుకున్న మంచిపేరు కాస్తా ఒక్క మాటతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అయితే, తన మాటను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని, నగరం చల్లగా ఉండాలన్నదే తన అభిమతమని ఆమె క్లారిటీ ఇచ్చారు..

అసలేం జరిగిందంటే..
గతేడాది చివర్లో భారీ వర్షాల దెబ్బకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైపోవడం, గడిచిన 100 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదుకావడంతో వేలకొద్దీ ఇళ్లు రోజులపాటు నీట మునగడం, జీహెచ్ఎంసీ పాలక మండలి, తెలంగాణ సర్కారుపై బాధితులు దుమ్మెత్తిపోయడం, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బతినడం తెలిసిందే. నగరానికి మేయర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మి.. నాటి విపత్తును గుర్తుచేసుకూంటూ.. అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలను ఎడిట్ చేసి, ఇదేనా మీ టీఆర్ఎస్ మేయర్ బాధ్యత? అంటూ నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు. దీంతో చివరికి మేయర్ మరోసారి వివరణ ఇచ్చుకున్నారు..

ఐదేళ్లూ వానలు కురవొద్దు..
కొత్త మేయర్ ను ఇంటర్వ్యూ చేస్తోన్న క్రమంలో ఓ ప్రముఖ ఛానెల్ కు చెందిన రిపోర్టర్.. గతేడాది వరదల విలయాన్ని గుర్తుచేస్తూ.. మరోసారి నగరంలో గనుక భారీ వర్షాలు కురిస్తే ఆపదలు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి భరోసానిస్తారు? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మేయర్ విజయలక్ష్మి బదులిస్తూ.. ''ఫస్ట్ థింగ్ నేను దేవుణ్ని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని'' అని చెప్పారు. అంతేకాదు, సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నా ప్రజలు కూడా తమ వంతుగా ఆలోచించాలని, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయన్నది సుస్పష్టం అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు తాను అక్రమ ఇళ్లను కూల్చలేనని, ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వరదల విపత్తును నిర్వహించలేమని మేయర్ అభిప్రాయపడ్డారు. కాగా,

వానలు కాదు వరదలు..
హైదరాబాద్లో ఈ ఐదేళ్లు వర్షాలు పడకూడదని భగవంతుడిని కోరుకుంటానంటూ కొత్త మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అసలు వర్షాలు పడకూడదని కోరుకోవడమేంటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ప్రజల బాధ్యత దేవుడిదేనంటూ సెటైర్లు పేలుస్తున్నారు. వెతికి వెతికి జోకర్ని తెచ్చి మేయర్ని చేశారంటూ కొందరు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో మేయర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. వానలు కురవొద్దని తాను కోరలేదని, ఈ ఐదేళ్లూ వరదలు రావొద్దన్నదే తన అభిమతమని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు..

ట్రోలర్స్పై మేయర్ గరం గరం
ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తాను చెప్పిన ఒక మాటను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ మేయర్ విజయలక్ష్మి మండిపడ్డారు. అంతులేకుండా సాగుతోన్న ట్రోలింగ్ కు అడ్డుకట్ట పడేలా మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. నగరంలో గత వందేళ్లలో రానంత ఎక్కువగా ఈసారి(2020చివర్లో) వర్షాలు పడ్డాయని.. దాంతో నగరంలో వరదలు వచ్చాయని గుర్తుచేస్తూ, రాబోయే రోజుల్లో అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటానని చెప్పానని.. కానీ కొంతమంది తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పనిలో పనిగా షేక్పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంపైనా ఆమె క్లారిటీ ఇచ్చేశారు. గతంలో విజయలక్ష్మి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో షేక్ పేట తహసీల్దారుతో గొడవ కావడం, ఇప్పుడామె మేయర్ అవుతూనే సదరు అధికారిపై బదిలీ వేటు పడటం చర్చనీయాంశమైంది. అయితే, అది సాధారణ బదిలీ కావొచ్చని, దాంతో తనకేమాత్రం సంబంధం లేదని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications