సందు చూసి చిందేస్తామంటే కుదరదు.. మటన్ అధిక ధరలకు అమ్మితే కఠిన శిక్షలే.. జీహెచ్ఎంసీ హెచ్చరిక..
హైదరాబాద్ : లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర సరుకులు, ప్రజా సౌకర్యాలు, సౌలభ్యత, కల్తీ, బ్లాక్ మార్కెట్ తదితర అంశాలపై నగర పాలక సంస్థ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల రేట్లను అధిక ధరలకు విక్రయిస్తే కొరడా ఝుళిపిస్తావమని గతంలో వ్యాపారస్తులకు నగర పాలక సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పాలు, కోడి గుడ్లను కూడా ఎక్కువ ధరలకు అమ్మకూడదని వివిధ షాపులను హెచ్చరించింది జీహెచ్ఎంసీ. తాజాగా వారాంతపు సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రియంగా వండుకునే మటన్ పైన రేట్లను పెంచితే జైలుకు పంపిస్తామని ఘాటు హెచ్చరికలు జారీ చేసింది నగర పాలక సంస్థ.
లాక్ డౌన్ కొనసాగుతోంది.. జీతాల్లో కోత పడుతోంది.. ధరలు పెంచొద్దంటున్న జిహెచ్ఎంసి..
నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ పరిధిలోని మాంసం విక్రయదారులకు అధికారులు షాక్ ఇచ్చారు. అధిక ధరలకు మాంసం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మటన్ అధిక ధరలకు విక్రయిస్తున్నాయంటే వచ్చిన ఫిర్యాదుల మేరకు పలు మటన్ షాపులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. అదికారులు. దీంతో గతంలో మటన్ విక్రయాలను ఏ రేటుకు అమ్మారో అదే ధరలతో మాంసాన్ని విక్రయించాలని ఆదేశాలు జారీ చేసారు నగర పాలక సంస్ధ అదికారులు.
వారాంతపు సెలవుల్లో జోరుగా మటన్ వినియోగం.. అధిక ధరలపై మటన్ షాపులకు జిహెచ్ఎంసి వార్నింగ్..
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని పలు మటన్ షాపులపై జిహెచ్ఎంసి అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మొత్తం 62 షాపులపై దాడులు నిర్వహిస్తే వాటిలో 52 షాపులకు కనీసం లైసెన్సులు కూడా లేవని అధికారులు గుర్తించారు. ఈ దుకాణాలలో అధిక ధరలకు మటన్ విక్రయిస్తున్నట్లు గుర్తించి, యజమానులపై కేసులు నమోదు చేశారు. కిలో మాంసం 700 రూపాయల కంటే ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తప్పవని మటన్ షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.
లైసెన్స్ లేకుండా నడుస్తున్న మటన్ షాపులు.. విస్మయానికి గురౌతున్న అధికారులు...
కొన్ని దుకాణాలలో మాంసం కల్తీకి గురవుతున్న ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు యజమానులను హెచ్చరించారు. కల్తీ మాంసం విక్రయిస్తే జైలు పాలవుతారని వార్నింగ్ ఇచ్చారు. షాపులో కూడా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ఆదివారాలు అధిక రద్దీ ఉండే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మటన్ షాప్ యజమానులకు అధికారులు సూచించారు. వారాంతపు సెలవుల్లో ప్రజలు ఇష్టంగా భావించే మాంసాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు ఫిర్యదులు వస్తే పరిస్ధితులు దారుణంగా ఉంటాయని ఘాటుగా హెచ్చరిస్తున్నారు అధికారులు.
Recommended Video
మటన్ ధర పెంచి అమ్మితే జైలుకే.. షాపు సీజ్ చేస్తామంటున్న జిహెచ్ఎంసి...
ఇక లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యలో నగరం మొత్తం స్తంభిచిపోయిన పరిస్థితులు తలెత్తాయి. మొత్తం జన జీవన స్రవంతి కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు యుద్దం చేస్తోంది. అరకొర సౌకర్యాలతో లాక్ డౌన్ ఆంక్షలను పాటిస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులతో పాటు, కూరగాయలు, చికెన్, మటన్, కోడిగుడ్ల రేట్లను వ్యాపారస్తులు కాస్త పెంచి విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటారు. దేశంతో పాటు రాష్ట్రం కూడా షట్ డౌన్ అయిపోయిన తరుణంలో ప్రజలు చాలా వరకు జీవనోపాది కోల్పోయారు. పని చేస్తున్న కార్యలయాలు జీతాల్లో భారీగా కోతలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెంచితే సామాన్యులకు మరింత భారమవుతుందని భావించిన నగర పాలక సంస్థ వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టి నగర ప్రజల ప్రశంసలు పొందుతునట్టు తెలుస్తోంది.