"చంద్రముఖి" కథ సుఖాంతం.. రెండు రోజుల హైడ్రామాకు తెర
Recommended Video

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం వేడేక్కుతోంది. హైదరాబాద్ గోషామహల్ నుంచి బరిలో నిలిచిన ట్రాన్స్జెండర్ చంద్రముఖి అదృశ్యం కేసు చర్చానీయాంశంగా మారింది. అయితే ఈకేసులో పురోగతి సాధించారు పోలీసులు. బుధవారం అర్ధరాత్రి బంజరాహిల్స్ ఏరియాలోని ఇందిరానగర్ లో చంద్రముఖి ఆచూకీ కనుగొన్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.
ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారనేది చంద్రముఖి వాదన. విజయవాడకు తీసుకెళ్లి అక్కడినుంచి చెన్నైకి తరలించి వదిలేశారని చెబుతున్నారు. అక్కడినుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే ఈకేసులో వెంకట్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఇంతకు ఆయన ఎవరు, ఈకేసుతో సంబంధముందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కనిపించడం లేదు..! పీఎస్ ఎదుట ఆందోళన
గోషామహల్ అసెంబ్లీ స్థానానికి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చంద్రముఖి మూడు నాలుగు రోజుల కిందటే ప్రచారం ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో
మంగళవారం ఉదయం 8 గంటల తరువాత చంద్రముఖి కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మరోవైపు బీఎల్ఎఫ్ నేతలు, ప్రజా సంఘాలు, ట్రాన్స్జెండర్లు ఆందోళనకు దిగారు. బుధవారం నాడు బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ అభ్యర్థి అదృశ్యం కావడంపై బీఎల్ఎఫ్ నేతలు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు.

లోతుగా దర్యాప్తు.. ఆచూకీ లభ్యం
ఎన్నికల వేళ గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి అదృశ్యం కావడంపై బంజారాహిల్స పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు ఫోన్ కాల్స్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో చంద్రముఖి ఇందిరానగర్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే చంద్రముఖిని ఎవరూ కిడ్నాప్ చేయలేదనేది పోలీసుల వాదన. తనకు తానుగా అదృశ్యమైనట్లుగా భావిస్తున్నారు. చంద్రముఖి ఫోన్ సంభాషణల ఆధారంగా తను సహచర ట్రాన్స్జెండర్లతో మాట్లాడినట్లు గుర్తించామంటున్నారు.

ఈ వెంకట్ ఎవరు?
చంద్రముఖి అదృశ్యం కేసులో అనూహ్యంగా వెంకట్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. గతంలో ట్రాన్స్జెండర్లపై భౌతికదాడులకు దిగడమే గాకుండా నగదు, నగలు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వెంకట్ చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో చంద్రముఖి అదృశ్యం ఎపిసోడ్ తో వెంకట్ కు సంబంధముందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అనంతపురం సమీపంలో ఉండొచ్చనే అనుమానంతో అక్కడికి ప్రత్యేక గాలింపు బృందాలను పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications