తెలుగు రాష్ట్రాల ప్రజలకు కన్నీళ్లు తెప్పిస ఉల్లిపాయల ధరలు!
రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల నెలవారి బడ్జెట్ పైన తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఎల్ నినో ప్రభావంతో సాగు తగ్గడం పంటలు సరిగా పండక పోవడం, మరోవైపు రవాణా చార్జీలు పెరగడంతో, ఆ ఛార్జీల భారాన్ని కూడా నిత్యవసర వస్తువుల పైన వేయడం వంటి చర్యలతో సామాన్యులు కుదేలవుతున్నారు.
భారీగా పెరుగుతున్న ఉల్లిపాయల ధరలు
తాజాగా ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ప్రతిరోజు అవసరమైన ఉల్లిపాయలు సామాన్య మధ్య తరగతి కుటుంబాల ప్రజల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఉల్లిపాయల ధరలు మళ్లీ భారీగా పెరిగి కిలో రూ.40 నుంచి రూ.50 వరకు చేరుకున్నాయి. గత నెలలో రూ.20కే లభించిన ఉల్లి ఇప్పుడు రెట్టింపు ధరకు అమ్ముడవుతోంది. దీంతో ఇంటి ఖర్చులు మరింత పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి పెరుగుతోంది.

రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం
కిలో ఉల్లిపాయల ధరలు 50 రూపాయలకు చేరుకోవడంతో వంటలో ఉల్లిపాయలను వాడడానికి కూడా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో పంట సాగు ఆలస్యం కావడం, ఖరీఫ్ సీజన్లో ఉల్లి దిగుబడి తగ్గడం, అలాగే డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఉల్లి ధరలు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
సామాన్యులకు భారంగా ఉల్లి ధరల పెరుగుదల
ఇప్పటికే మార్కెట్లో పంచదార ధరలు పెరుగుతుండగా, ఉల్లి ధరలు కూడా పెరగడం సామాన్యులకు మరో భారం అయ్యింది. ఇదిలా ఉంటే కూరగాయల ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లోని కూకట్పల్లి రైతు బజార్లో ప్రస్తుతం టమోటా కిలో రూ.15, వంకాయ రూ.28, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.45, ఉల్లిపాయ రూ.40, ఉల్లిపొర రూ.45, బీన్స్ రూ.75, క్యారెట్ రూ.45, ఆలుగడ్డ రూ.18 వంటి రేట్లు నమోదవుతున్నాయి.
ధరలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని సామాన్యుల విజ్ఞప్తి
విజయవాడ రైతు బజార్లలో టమాట రూ.25, ఉల్లి రూ.40, పచ్చిమిర్చి రూ.48, బీన్స్ రూ.100, క్యాప్సికం రూ.50గా పలుకుతున్నాయి. కూరగాయల తర్వాత పాటు ఉల్లిపాయల ధరలు కూడా పెరగడంతో రోజువారీ ఖర్చులు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.













Click it and Unblock the Notifications