ప్రభుత్వ భూములను అమ్మడం ఏంటీ: ఇందిరా శోభన్
ఆదాయం కోసం సర్కారు భూములను అమ్మాలనుకోవడం అనైతికమని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా అవసరాలు స్కూళ్లు, ఆసుపత్రులు, గోదాములు తదితర వాటి కోసం ప్రభుత్వ ఆస్తులను వినియోగించాలి కానీ.. ఇలా విక్రయించడవ ఏంటని ఆమె ప్రశ్నించారు.

మరీ ఇప్పుడు..
హైదరాబాద్ ఆదాయాన్ని అంతా ఆంధ్రోళ్లు దోచుకుపోతున్నారని ఉద్యమ సమయంలో ఆరోపణలు చేసిన కేసీఆర్.. ఈ ఏడేళ్లలో తెలంగాణ ఆదాయమంతా ఎవరి పాలయ్యిందో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని.. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎలా అయ్యిందో తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందన్నారు.

అప్పుల కుప్ప..
ఉచిత విద్య, ఉచిత వైద్యం, దళితులకు 3 ఎకరాల భూమి లాంటివి ఏవీ అందించకుండా అసలు ఇంత అప్పు ఎందుకైందో చెప్పాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని.. ఎఫ్ఆర్బీయం పరిమితిని పెంచాలని ఓవైపు హరీష్ రావు గగ్గోలు పెడుతుంటే, కేసీఆర్ మాత్రం అవసరం లేకపోయినా ఇటీవల అదనపు కలెక్టర్లకు లగ్జరీ కార్లను అందించి గొప్పలకు పోవడమేంటని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నా, ధాన్యం కొనుగోలు చేయాలన్నా, మహిళలకు రుణాలు ఇవ్వాలన్నా నిధులు లేవని సాకులు చెప్పే ప్రభుత్వానికి.. కార్ల కొనుగోలుకు డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.

బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ..
బంగారు తెలంగాణ పేరుతో ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. బయట ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో.. ఇప్పుడు భూములను అమ్మాలని చూడటం ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు ఇందిరాశోభన్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోటాను కోట్ల రూపాయలు వెనుకేసుకున్న కేసీఆర్ ఫ్యామిలీ.. నేడు భూములు విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును కాజేయాలని చూస్తుందని ఆమె ఆరోపించారు.

ఆక్రమణలే
అటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమంగా ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న వనరులను నాశనం చేయాలని సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని.. లేనిపక్షంలో మరో ప్రజా పోరాటం తప్పదని ఇందిరాశోభన్ హెచ్చరించారు












Click it and Unblock the Notifications