మీ భరతం పట్టడం ఖాయం.. వారి గోస తగులుతుంది, కేసీఆర్పై విజయశాంతి విసుర్లు
తెలంగాణ సర్కార్పై రాములమ్మ విజయశాంతి మరోసారి చెలరేగిపోయారు. ఈ సారి ఉద్యోగుల అంశాన్ని ఆమె లేవనెత్తారు. ఉద్యోగ దంపతుల బదిలీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు బాగోలేదన్నారు. అంతేకాదు ఇదీ ఒక లూప్ హోల్ అని కామెంట్ చేశారు. ఇందుకోసం భారీగా సొమ్ము చేతులు మారాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.
నిబంధనలకు తిలోదకాలు..
కేసీఆర్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా స్పౌజ్ బదిలీలు చేస్తోందని విజయశాంతి ఆరోపించారు. ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తోందని.. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు అడుగుతున్నారని గుర్తుచేశారు. అయితే ఆయా జిల్లాల్లో పోస్టులు లేవని... కొత్తగా వేరే ఎవరైనా వస్తే కేడర్ స్ట్రెంత్ డిస్టర్బ్ అవుతుందని చెప్పడం భావ్యం కాదన్నారు. నిన్నటి వరకు స్పౌజ్ బదిలీలపై సర్కారు పెద్దలు కుంటి సాకులు చెప్పి... లోలోన మాత్రం బ్లాక్ చేసిన జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలు కానిచ్చేశారని తెలుస్తోంది.
అంతా వీరే చేశారు..
సీఎస్, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆఫీసర్ల కనుసన్నలలో జరిగిందని విజయశాంతి ఆరోపించారు. విషయం సంబంధిత మంత్రికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు కూడా సమాచారం ఇవ్వకుండా కానిచ్చేశారు. రెండు రోజుల కింద నేరుగా సెక్రటేరియట్ నుంచి 13 జిల్లాల కలెక్టర్లకు 400 మందికి సంబంధించిన స్పౌజ్ ఆర్డర్లు వాట్సాప్ ద్వారా పంపిస్తే వీటిని కలెక్టర్లు సోమవారం డీఈవోలకు పంపించగా... వారంతా అదే రోజు ఆ టీచర్లకు గుట్టు చప్పుడు కాకుండా పోస్టింగ్స్ ఇచ్చేశారు. ఇందుకోసం భారీగా సొమ్ములు చేతులు మారాయి. దీనిపై టీచర్ల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నా.. కేసీఆర్ సర్కార్ మొద్దు నిద్రపోతోందని.. ట్రాన్స్ఫర్లపై వచ్చిన టీచర్ల వివరాలను డీఈవోలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
వీరే అప్ లోడ్ చేశారు..
వివరాలన్నీ ఫైనాన్స్ వారికి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో డీఈవోలు పంపిచారని... ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ వాళ్లే వీటిని అప్లోడ్ చేశారని పేర్కొన్నారు. గుట్టుగా ఎందుకు చేశారనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదన్నారు. చివరికి సంబంధిత మంత్రికీ విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ సర్కార్లో మంత్రి పేరుకు మాత్రమే... ఏదైనా సమాచారం ఇవ్వాల్సి వస్తేనే అధికారులు డీఈవోకు కమ్యూనికేట్ ఫైల్ పెడతారు. అలాంటిది కేడర్ స్ట్రెంత్ మార్పు విషయంలో ఎలాంటి ఫైల్స్ వెళ్లకపోవడంపై అధికారుల్లోనూ అయోమయం నెలకొంది.
వారికి కూడా తెలియదట
గతంలో 19 జిల్లాల్లో జరిగిన స్పౌజ్ బదిలీల ద్వారా 876 మంది, ఆ తర్వాత రివర్స్ స్పౌజ్ ద్వారా మరో 50 బదిలీలు చేశారు. ఈ వివరాలు ఎడ్యుకేషన్ డైరెక్టర్కి కూడా తెలీదట. వెంటనే ఆ బదిలీలను వెనక్కి తీసుకోవాలని.. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికీ పుట్టగతులుండవని విజయశాంతి మండిపడ్డారు. ఈ ఉద్యోగులే నీ భరతం పడుతారని ఆమె ఫైరయ్యారు.