ఈ మెయిల్ హ్యాక్ చేసి 1.09కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు..
హైదరాబాద్ : టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరస్థుల పంట పండుతోంది. కంపెనీల మెయిల్లు హ్యాక్ చేస్తూ కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా హాంకాంగ్కు చెందిన ఓ కంపెనీపై హ్యాకర్లు పంజా విసిరారు. సంస్థ ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ చేసి కోటి రూపాయలు కొట్టేశారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అటు హాంకాంగ్తో పాటు హైదరాబాద్లో కేసు బుక్ అయింది.
వామ్మో .. చెడ్డీ గ్యాంగ్ : ఇందూరులో బీభత్సం.. మంగళసూత్రం చోరీ
రూ.కోటి పోగొట్టుకున్న రాడిక్స్
హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిక్స్ మైక్రో సిస్టమ్ కంపెనీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఇందుకు అవసరమైన ముడి సరుకును హాంకాంగ్ నుంచి తెప్పించుకుంటోంది. గతనెల ఈ లావాదేవీలకు సంబంధించి రూ.1.09కోట్ల మొత్తాన్ని పంపుతానంటూ రాడిక్స్ కంపెనీ ప్రతినిధి రాజ్కుమార్ సన్హానర్స్ హోల్డింగ్స్ కంపెనీకి మెయిల్ పంపాడు. అదే రోజు సదరు కంపెనీ నుంచి రిప్లై వచ్చింది. తమ బ్యాంకు ఖాతా మారిందని, ఫలానా బ్యాంకు అకౌంట్లో నగదు జమ చేయాలంటూ ఓ ఖాతా వివరాలు పంపింది. ఆ ఈ మెయిల్ నిజమేనని నమ్మిన రాజ్కుమార్ రూ. 1.09 కోట్లు వారు చెప్పిన అకౌంట్లో డిపాజిట్ చేశాడు.
డబ్బు పంపండంటూ మెయిల్
డబ్బు జమ చేసిన అనంతరం మే 21న సన్హానర్స్ కంపెనీ నుంచి రాడిక్స్ మైక్రో సిస్టమ్కు మరో మెయిల్ వచ్చింది. తాము పంపిన సరుకుకు సంబంధించిన నగదు పంపమన్నది దాని సారాంశం. అది చూసి షాక్ అయిన రాడిక్స్ ప్రతినిధులు తాము నగదు జమచేసిన విషయాన్ని మెయిల్ చేశారు. సన్హానర్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ పంపాలని కోరగా... రాడిక్స్ పంపింది. అయితే అది తమ బ్యాంక్ అకౌంట్ కాదని సన్ హానర్స్ ధ్రువీకరించింది. హ్యాకర్లు తమ కంపెనీ మెయిల్ హ్యాక్ చేశారని గుర్తించింది.
కోపెన్హాగెన్ అకౌంట్కు బదిలీ
సన్హానర్స్ హోల్డింగ్ కంపెనీ ఈ మెయిల్ అకౌంట్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.09కోట్లు కొల్లగొట్టారు. ఆ మెుత్తాన్ని కోపెన్హాగెన్లోని బ్యాంకుకు బదిలీ చేశారు. ఈ మోసానికి సంబంధించి సన్హానర్స్ సంస్థ హాంకాంగ్లో ఫిర్యాదు చేయగా... రాడిక్స్ మైక్రో సిస్టమ్స్ జూన్ 2న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.