హరీష్ రావు, కవిత రాజీనామాలు..! పార్టీ శ్రేణుల్లో అయోమయం..! ఆశ్యర్యం..!!
హైదరాబాద్ : తెలంగాణలో అతి ముఖ్య నేతలు ఇప్పుడు అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు. అనుబంధ సంస్థలకు అకస్మాత్తుగా రాజీనామా చేస్తూ అందరిలో అయోమయాన్ని నింపుతున్నారు. భారీనీటిపారుదల మాజీ మంత్రి, గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ టీ హరీష్య రావు, ముఖ్యమంత్రి తనయ, నిజామాబాద్ ఎంపి కవిత వ్యవహారం పైన పార్టీ లో తారా స్థాయిలో చర్చ జరుగుతోంది. సిద్ది పేటలో రికార్డు స్ధాయి మెజారిటీతో గెలుపొందిన హరీష్ రావు, తెలంగాణ జాగ్రుతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో ఎవరికి అంతుచిక్కకుండా మారింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సింగరేణి బొగ్గు కార్మిక సంఘం (ఎస్సీడబ్ల్యూయూ) గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు మిగతా సంఘాల పదవులకు శనివారం రాజీనామా సమర్పించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీ చేయనున్నందున ఆమె నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి టీ.హరీశ్ రావు టీఎస్ ఆర్టీసి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..! అయితే తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉండే హరీష్ రావు, కవిత ఇంత అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేసారని సర్వత్రా చర్చ జరుగుతోంది.