ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణం ఇంకెప్పుడు... ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు...
నిజాం కాలం నుంచి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణం కలగానే మిగిలిపోయింది. పాత భవనాల స్థానంలో ట్విన్ టవర్స్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ... ఇప్పటికీ అది నెరవేరలేదు. ఇదే అంశంపై తాజాగా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. కొత్త భవనాల నిర్మాణానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని ప్రశ్నించింది. హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్ల స్థానంలో కొత్త భవనాలను నిర్మించలేరా అని నిలదీసింది.
కొత్త భవనాల నిర్మాణంపై మరికొంత సమయం కావాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టును కోరగా...న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని మండిపడింది. ప్రభుత్వ తీరు సరిగా లేదని... కొత్త భవనాల ప్లాన్,గూగుల్ మ్యాప్ కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పేర్కొంది.
వైద్యారోగ్య శాఖ యంత్రాంగం ప్రస్తుతం కరోనా నియంత్రణలో బిజీగా ఉన్నారని.. మరికొంత గడువు కావాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు.దీంతో మరో 6 వారాల్లో తుది నిర్ణయం తీసుకుని బ్లూప్రింట్ సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆస్పత్రిని పూర్తిగా కూల్చివేసి కొత్త భవనాలను నిర్మిస్తారా... లేక కొన్ని బ్లాక్లలో మాత్రమే కొత్త భవనాలను నిర్మిస్తారా అన్న దానిపై స్పష్టతనివ్వాలని చెప్పింది.
గతేడాది కురిసిన వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి వార్డులోకి వర్షపు నీరు చేరిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రి పెచ్చులు ఊడి కొంతమంది గాయపడ్డ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.ఐదేళ్ల క్రితం 2015లో ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి పాత బ్లాక్ల స్థానంలో ట్విన్ టవర్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 110 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలమై పోయిందని, రోగులు, వైద్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ భవనం ఇక నిలువదని జేఎన్టీయూ ఇంజినీర్లు కూడా చెప్పారని అన్నారు.చారిత్రక కట్టడం.. హెరిటేజ్ అని చెప్పి వందల ప్రాణాలు బలి పెట్టలేమని... హెరిటేజ్ చట్టాల్లో మార్పులు రావాలని అన్నారు.
అయితే సీఎం మాటలు ఇప్పటికీ ఆచరణ రూపం దాల్చలేదు. హెరిటేజ్ భవనాలను మినహాయించి ఐదెకరాల స్థలంలో అధునాతన ట్విన్ టవర్స్ నిర్మించేందుకు ప్రణాళిక,మ్యాప్ను కూడా సిద్దం చేసిన ప్రభుత్వం... ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారించాలని ఉస్మానియా వైద్యులు,ప్రజలు కోరుతున్నారు.