Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మరో రెండు రోజులు కూడా..!
బుధవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్సాఆర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఖైరతాబాద్ చౌరస్తాలో వర్షపు నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది నిలిచిపోయిన నీరును ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తోంది. హైదరాబాద్ లో మరో రెండు రోజులు పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
శుక్రవారం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. హైదరాబాద్లో, సెప్టెంబర్ 28 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 129.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో అత్యధికంగా ముషీరాబాద్లో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశంలో రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఈసారి రుతుపవనాలతో ఆశించిన స్థాయిలోనే వర్షం పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications