భాగ్యనగరంలో దంచికొట్టిన వాన.. ఇతర చోట్ల కూడా.. ఉక్కపోత..
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. సీతాఫల్ మండిలో అత్యధికంగా 4.2 సెం.మీ. మల్కాజ్గిరిలో 3.13, ముషీరాబాద్లో 3.1, వెస్ట్ మారేడ్పల్లిలో 2.8 సెం.మీ. వర్షం కురిసింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. వర్షం నీరు నిలిచి వీఎస్టీ చౌరస్తా చెరువును తలపించింది. పలు చోట్ల చెట్లు పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు.
అంబర్ పేట ఛే నంబర్ చౌరస్తా, ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా, తిలక్ నగర్ రైల్వే బ్రిడ్జ్, గోల్నాక చౌరస్తా, కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తా, అంబర్ పేట సీపీఎల్ మెయిన్ రోడ్లు వర్షం నీటితో జలమయంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో గంటన్నరపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు అన్నారు.
ఇటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది. చాలా చోట్ల ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షం కురవనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు పొలం పనుల్లో నిమగ్నం అయ్యారు.