రాష్ట్రంలో వర్ష బీభత్సం, ముసురేసిన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు..
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తడిసిముద్దయ్యింది. గత మూడు రోజుల నుంచి వర్షం కురవడంతో కాలనీ/ బస్తీల్లో వరదనీరు చేరింది. ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల వద్ద వర్షపునీరు నిలిచిపోయింది. మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో వర్షాలు కురుస్తోన్న క్రమంలో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంత్రులంతా జిల్లాల్లో ఉండాలని.. కలెక్టర్, పోలీసు అధికారులతో కలిసి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని చెప్పారు. దీంతో కొన్ని చోట్ల చెరువులకు గండ్లుపడే అవకాశం ఉందని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Recommended Video
వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అన్ని చెరువులు అలుగుపోస్తున్నందున ఏమరపాటు వద్దు అని అధికారులకు స్పష్టంచేశారు. రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటి కప్పుడు ఆరా తీస్తూ.. జిల్లాలలో పరిస్థితి సమీక్షించి సూచనలు ఇస్తున్నారు. సీఎం ఆదేశాలతో రెండు హెలీకాఫ్టర్లను అధికారులు సిద్దంగా ఉంచారు. హెలికాఫ్టర్తోపాటు మరో సైనిక హెలికాఫ్టర్ కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు.