కరోనా పరిస్థితిపై తెలంగాణ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు: పోలీసుల తీరుపైనా..
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనావైరస్ ప్రభావంపై ఎక్కువగా ఉండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనావైరస్పై దాఖలైన కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది? టెస్టింగ్ కిట్లు ఎన్ని ఉన్నాయో వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో 67వేల టెస్టింగ్ కిట్లే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారని.. అయితే పెద్ద సంఖ్యలో ఉన్న హాట్ స్పాట్లలోని ప్రజలకు ఎలా పరీక్షలు చేస్తారని ప్రశ్నించింది. ఏప్రిల్ 24 లోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్కారును ఆదేశించింది.
ఇది ఇలావుండగా, వనపర్తిలో లాక్డౌన్ సమయంలో పోలీసులు అతిగా ప్రవర్తించారన్న వ్యాజ్యంపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ఏజీ తమ వాదనలు వినిపించారు. చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలని, ప్రజలను కొట్టవద్దని డీజీపీ ఆదేశించినట్లుగా కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలో పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. అతిగా, దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఏప్రిల్ 24 లోపు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, వనపర్తిలో ఓ పౌరుడిపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడని, అతనిపై సస్పెన్షన్ తోపాటు ఏ చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 700కు చేరింది. శుక్రవారం మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో ఇప్పుడు మొత్తం 706కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఐదు కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. సూర్యపేట జిల్లాలో మొత్తం 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది.