ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: స్టే ఎత్తివేసిన హైకోర్టు, పోలీసుల ఎంక్వైరీ, కస్టడీ..?
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కేసులో మొయినాబాద్ పోలీసులకు రిలీఫ్ కలిగింది. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన ఆ ముగ్గురిని విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. ఇదివరకు ఉన్న స్టేను ఎత్తివేసింది. కానీ కస్టడీ కోసం మొయినాబాద్ పోలీసులు రేపు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అక్కడ వాదనల తర్వాత 14 రోజుల కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
కేసు దర్యాప్తుపై ఇప్పటివరకు స్టే ఉన్న సంగతి తెలిసిందే. దానిని మంగళవారం హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది. కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున బీజేపీ పిటిషన్పై విచారణ జరగనుంది. కేసును పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని కోరుతుంది. మరోవైపు రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదని తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశం లేదు. ఒకవేళ హైకోర్టు విచారణ జరపాలని కోరితే మాత్రం ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ముగ్గురు నిందితులు జైలులోనే ఉన్నారు. అయితే 3 రోజుల కింద సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు కొనుగోలు అంశానికి సంబంధించి వివరాలు తెలియజేశారు. వీడియో కూడా విడుదల చేశారు. దీనిపై బీజేపీ తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా, నడ్డా, మోడీ పేరు చెప్పడం నిబంధనలకు ఉల్లంఘన కిందకు వస్తోందని తెలియజేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కోసం రామచంద్ర భారతి అండ్ కో ప్రయత్నించారు. పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడగా.. ఆ ఆడియో, వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది. రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పగా.. సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశాలతో మొయినాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications