భార్యను హతమార్చి కరోనాతో చనిపోయిందని నమ్మించిన భర్త .. తిరుపతి ఘటన మరువక ముందే మరో ఘటన
మొన్న తిరుపతిలో హైదరాబాద్లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేసే ఉద్యోగినిని భర్త హతమార్చి, సూట్ కేస్ లో ప్యాక్ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా తగలబెట్టి, తన భార్య డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా బారిన పడిందని, మరణించిందని,ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని సైతం ఇవ్వలేదని బంధుమిత్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్ తో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఉదంతాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన విజయ్ అనే వ్యక్తి తన భార్య కవితను కూడా హతమార్చాడు.
బంధువులందరికీ తన భార్య కరోనాతో చనిపోయిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానంతో మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రీ పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు భర్త చేసిన ఘాతుకాన్ని బయటపెట్టారు.ఇక పోలీసులు చెప్పిన కథనం ప్రకారం విజయ్, కవిత ఇద్దరు భార్య భర్తలు. వనస్థలిపురంలో జీవనం సాగిస్తున్న వీరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. అయితే ఇటీవల విజయ్ తన భార్యను హతమార్చి భార్య మృతదేహాన్ని సొంత గ్రామమైన మిర్యాలగూడ పిల్ల గుంట్ల తండాకి తీసుకుని వెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
మృతదేహాన్ని ఎవరూ పరిశీలించకుండా ఉండటం కోసం కవిత కరోనా బారిన పడిందని, కరోనా తో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇక విజయ్ ప్రవర్తనలో మార్పు గమనించిన కవి తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కవిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కవిత కరోనాతో చనిపోలేదని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వెల్లడించారు. భర్త భార్యను హతమార్చి కరోనాతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారని గుర్తించిన పోలీసులు విజయ్ ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.