శంషాబాద్ విమానాశ్రయంలో జాంబియా మహిళ అరెస్ట్: 3.2 కిలోల హెరాయిన్ సీజ్, విలువ రూ. 21 కోట్లు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ దగ్గర్నుంచి 3.2 కిలోల హెరాయిన్ను సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ. 21 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
జాంబియా దేశం నుంచి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ మహిళ చేరుకుంది. అయితే, ఆమె విమానాశ్రయంకు చేరుకోగానే ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ బ్యాగ్ను అధికారులు తనిఖీ చేయగా, అందులో 3.2 కిలోల హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు.

నిందితురాలిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. విచారణ చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టబడిన హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత కొంత కాలంగా విమానాశ్రయాల్లో బంగారం, డ్రగ్స్ భారీగా పట్టుబడుతోంది. ఎక్కువగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పలువురు దొరుకుతున్నారు. ఎంతో తెలివిగా బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా చేసేందుకు నిందితులు ఉపాయాలు వేస్తున్నా.. డీఆర్ఐ, కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు.
శంషాబాద్ తోపాటు చెన్నై విమానాశ్రయంలో కూడా ఇటీవల కాలంలో అక్రమంగా తరలిస్తున్న భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారిని పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications