వరద సహాయక శిబిరాల్లో కరోనా కలకలం: 19 మందికి సోకిన వైరస్, జాగ్రత్తలే శ్రీరామ రక్ష
హైదరాబాద్: నగరాన్ని గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఓ వైపు కరోనా కేసులు నగరంలోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలు, వరదలు ప్రజలను మరింత హడలెత్తిస్తున్నాయి. భారీ వరదల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

సహాయక శిబిరాల్లో కరోనా కలకలం..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో వరద బాధిత ప్రజలను చేరుస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 165కు పైగా సహాయక శిబిరాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2వేల మందికిపైగా ప్రజలను ఆ శిబిరాలకు తరలించింది. కాగా, కరోనా నేపథ్యంలో వీరందరికి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో శిబిరాల్లోని 19 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా సోకినవారందర్నీ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

శిబిరాల్లోనే కరోనా, వైద్య పరీక్షలు..
రెస్క్యూ సెంటర్ల వద్ద ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశామని, అవసరమైన పరీక్షలు నిర్వహించి, మందులు అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఆరోగ్య శిబిరాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయని మంత్రి ఈటెల తెలిపారు. అంతేగాక, 42 మొబైల్ హెల్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావం ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన అవసరం లేని ప్రజలకు ఈ ఆరోగ్య కేంద్రాలు సేవలందిస్తున్నాయిన తెలిపారు.

వైద్య సిబ్బంది ఈటెల్ థ్యాంక్స్..
ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నియంత్రణకు పోరాడిన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది.. ఇప్పుడు వరద ప్రభావిత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. వరదలు, అపరిశుభ్రత వల్ల కలిగే వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. వరద ప్రభావిత ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు.
Recommended Video

జాగ్రత్తలే శ్రీరామరక్ష..
సహాయక శిబిరాల్లోని ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంచినీరును కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రమైన నీటినే తాగాలని, మొదట వేడి చేసుకున్న తర్వాతనే నీరు తాగితే మంచిదని తెలిపారు. కరోనాను దూరం చేసేందుకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications