లాస్ట్ మినిట్ ట్విస్ట్: మజ్లిస్ బెట్టు..మళ్లీ పాత పద్ధతి?: నో విప్..ఓటు ఎటైనా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎన్నిక సందర్భంగా అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అనూహ్య ఎత్తుగడను వేస్తోంది. రొటేషన్ పద్ధతిని తెర మీదికి తీసుకుని రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే ప్రతిపాదనన తెర మీదికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి- ఎక్స్ అఫీషియో సభ్యుల బలంతో మేయర్ స్థానాన్ని గెలుచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితికి సులువే. అయిదేళ్ల పూర్తి కాలాన్ని టీఆర్ఎస్ అనుభవించినందున.. ఈ సారి తమకు కూడా అవకాశాన్ని కల్పించాలనే డిమాండ్ను వినిపిస్తున్నట్లు సమాచారం.
మేయర్ పదవి ఎన్నికల్లో మజ్లిస్.. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎలాంటి పొత్తులు, సీట్ల సర్దుబాటు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పోటీ చేశాయి. ఇదివరకు మజ్లిస్-కాంగ్రెస్ రొటేషన్ పద్ధతిలో మేయర్ పదవీ కాలాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. అదే పద్ధతిని అనుసరించాలనే ప్రతిపాదనను మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. టీఆర్ఎస్ నేతల ముందుంచారని అంటున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.
హైదరాబాద్ మేయర్ అభ్యర్థినిగా కేకే కుమార్తె..డిప్యూటీగా మోతె శ్రీలత?: గెలుపుపై నో డౌట్స్?
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో.. మజ్లిస్ కార్పొరేటర్లు దారుస్సలాంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. మజ్లిస్ గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. 44 మంది కార్పొరేటర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 150 మంది సభ్యుల బలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 44 డివిజన్లను మజ్లిస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. వారంతా దారుస్సలాం సమావేశానికి హాజరయ్యారు. మేయర్ను ఎలా ఎన్నుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రొటేషన్ పద్ధతిని తెర మీదికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య ఫలితాలను సాధించిన నేపథ్యంలో.. ఆ పార్టీ దూకుడును అడ్డుకోవడానికి టీఆర్ఎస్కు తమ పార్టీ కార్పొరేటర్ల సహాయ, సహకారాలు అవసరం అవుతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక డిమాండ్లను టీఆర్ఎస్ ముందు ఉంచడానికి ఇదే సరైన తరుణమని మజ్లిస్ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై దారుస్సలాం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ.. విప్ను జారీ చేయగా.. మజ్లిస్ ఆ పని చేయలేదు. విప్ను జారీ చేయకపోవడం ఆసక్తి రేపుతోంది.