7 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం: నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 7 నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికులను బట్టి ప్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
జరిమానా తప్పదు..
మెట్రో స్టేషన్లతోపాటు రైళ్లలో భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మెట్రో రైలు ఎండీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. భౌతిక దూరాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని అన్నారు. మెట్రో రైలు ప్రయాణికులు మాస్కును తప్పనిసరిగా పెట్టుకోవాలని, లేని పక్షంలో జరిమానా విధిస్తామని తెలిపారు.
కరోనా లక్షణాలు లేకుంటే అనుమతి.. ఆ స్టేషన్లు మూతే
కరోనా అనుమానిత లక్షణాలు లేనివాళ్లకు మాత్రమే మెట్రో రైలులో ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఎన్వీఎస్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మెగ్రో ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేస్తామని తెలిపారు. స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మొదట ఈ కారిడార్లలోనే మెట్రో సేవలు
ఫేజ్-1 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయి.కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్) మార్గంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఫేజ్-2లో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కారిడార్-3(నాగోల్-రాయదుర్గం) సేవలు ప్రారంభమవుతాయి. ఈ మార్గంలో కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
Recommended Video
9 నుంచి అన్ని కారిడార్లలో.. ఆ స్టేషన్లు మాత్రం మూతే..
ఇక ఫేజ్-3లో భాగంగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి కారిడార్ 1,2తోపాటు 3లో కూడా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. కాగా, కంటైన్మెంట్ జోన్లలోని గాంధీ ఆస్పత్రి, భరత్ నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్గూడ స్టేషన్లు మూసే ఉంటాయని ఆయన తెలిపారు.