పెద్దోళ్లే టార్గెట్.. కోట్ల సొమ్ము చోరీ.. పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా
హైదరాబాద్ : జైల్లో కలుసుకున్నారు. దోస్తులుగా మారారు. ఇద్దరూ చిల్లర దొంగలకు మరో పెద్ద దొంగ తోడయ్యాడు. చిన్న చోరీలు చేస్తే లైఫ్ లో ఎప్పుడూ సెటిలవుతారంటూ వారికి నూరిపోశాడు. థింక్ బిగ్ అంటూ "దొంగ పాఠాలు" నేర్పించాడు. ఇంకేముంది అన్నా నువ్వెట్లా చెబితే అట్లా అంటూ పోలోమంటూ ఫాలో అయ్యారు ఆ ఇద్దరు. మొత్తానికి ముగ్గురు కలిసి పెద్దోళ్లను టార్గెట్ చేశారు. కోట్ల రూపాయల సొమ్మును చోరీ చేశారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న దొంగల గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. కరడుగట్టిన దొంగ కర్రి సతీష్ ముఠాను హైదరాబాద్ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 7 దొంగతనాల్లో దోచిన సొత్తు కోటి 5 లక్షల రూపాయల విలువ గల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సతీష్ తో పాటు మరో ఇద్దరు దొంగలు నరేంద్ర, శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.

ఆభరణాలే ముద్దు.. నగదు వద్దు
కాస్ట్లీ ప్రాంతాలను టార్గెట్ చేసే ఈ దొంగల ముఠా ముందుగా రెక్కీ నిర్వహించిన అనంతరం చోరీకి పాల్పడుతుంది. స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్ ఎప్పుడూ వెంట ఉంచుకుని తిరిగే సతీశ్ ఇంటి గ్రిల్స్ తొలగించి లేదంటే తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడేవాడు. నరేంద్ర కూడా లోపలికి వెళ్తే.. శ్రీనివాస్ మాత్రం బయటనే వుండి చుట్టుపక్కల గమనించేవాడు. అయితే చోరీల్లో నగదు జోలికి వెళ్లకపోవడం గమనార్హం. ప్లాటినం, బంగారు, వజ్రాలు పొదిగిన విలువైన ఆభరణాలు మాత్రమే దోచుకెళుతుంటారు.
చెన్నై పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. 18 టీమ్స్ ను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. చోరీ సొత్తు విక్రయించడానికి ముంబై వెళుతున్నారని తెలిసి అప్రమత్తమయ్యారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. 1,712 గ్రాముల ప్లాటినం, బంగారం, వజ్రాలు పొదిగిన కోటి 5 లక్షల రూపాయల సొత్తు రికవరీ చేశారు.

చిన్నోడు పెద్దోడయ్యాడు
విశాఖపట్నం కొత్తగాజువాక కు చెందిన కర్రీ సతీష్ అలియాస్ సత్తిబాబు వృత్తిరీత్యా కారు డ్రైవర్. 2005 లో నేర ప్రస్థానం ప్రారంభించాడు. ఓ ఇంట్లో వాహనం దొంగిలించి పోలీసులకు చిక్కాడు. అనంతరం 17 దొంగతనాలకు పాల్పడ్డాడు. దీంతో అంతర్ రాష్ట్ర దొంగగా పోలీస్ రికార్డుల్లోకెక్కాడు. నాలుగు రాష్ట్రాల్లో 48 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీసులు 2016లో పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్ గూడ జైలుకు పంపారు. ఇక్కడే యూ టర్న్ తీసుకున్నాడు సత్తిబాబు. జైల్లో పరిచమయిన నరేంద్ర, శ్రీనివాస్ తో జతకట్టాడు. జైలు నుంచి విడుదలయ్యాక ముగ్గురూ కలిసి వరుస చోరీలకు పాల్పడ్డారు.

పెద్దోళ్ల ఇళ్లే టార్గెట్
విశాఖపట్నంలో కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు ఇంట్లో చోరీకి పాల్పడింది ఈ ముఠా. బెంగుళూరులో కర్ణాటక రిటైర్డ్ డీజీ అల్లుడి ఇంట్లో దొంగతనం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ సినార్ వ్యాలీలో నివాసముండే రియల్ ఎస్టేట్ వ్యాపారి శర్మ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిలో చోరీకి కూడా స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు.












Click it and Unblock the Notifications