సాయిపల్లవిపై పోలీసులకు భజరంగ్దళ్ ఫిర్యాదు: వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏవంటే?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి సాయి పల్లవిపై హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీసులకు భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదు చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాతోపాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన విరాటపర్వం చిత్రంలో రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. ఈ సినిమా జూన్ 17న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయిపల్లవి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోరక్షకులను కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోల్చుతారా? అంటూ భజరంగ్ దళ్ నేతలు సాయిపల్లవిపై మండిపడుతున్నారు. అసలు ఆమెకు ఏమైనా జ్ఞానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

అసలు సాయిపల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి?
'ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని చెప్పలేం.. కొన్ని రోజులముందు కూడా ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా.. ఆ టైమ్లో ఉన్న కాశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా.. ? మనం మత ఘర్షణలా చూస్తే.. రీసెంట్గా ఓ బండిలో ఎవరో ఆవులను తీసుకెళ్తున్నారు. ఆ బండిని నడుపుతున్న వ్యక్తి ముస్లీంగా ఉన్నారు. వాటిని చూసి కొంతమంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగినదానికి తేడా ఎక్కడవుంది.? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు. నేను న్యూట్రల్గా ఉంటాను' అని సాయిపల్లవి సదరు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.

లీగల్ ఒపీనియన్ తర్వాత సాయిపల్లవిపై చర్యలు
ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే భజరంగ్ దళ్ నాయకులు కాశ్మీర్ ఫైల్స్ సినిమాతోపాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, గోరక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంటర్వ్యూ వీడియో పరిశీలించి, లీగల్ ఒపీనియన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications