మాదాపూర్లో ఫెరారీ కారు బీభత్సం: పాదచారి మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో ఓ ఫెరారీ కారు బీభత్సం సృష్టించింది. కారు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణాం గాలిలో కలిసిపోయింది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగంతో అదుపుతప్పిన ఫెరారీ కారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ గౌడ్(29).. శంకర్ ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన యజమానిని ఎక్కించుకుని మాదాపూర్ నుంచి కూకట్పల్లికి టీఎస్08 ఎఫ్పీ 9999 నెంబర్ గల ఫెరారీ కారులో బయల్దేరారు.
కాగా, అతివేగంగా కారును నడపడంతో అదుపుతప్పి ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది.
ఫెరారీ కారు దూసుకెళ్లడంతో.. పాదచారి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
అదే సమయంలో అటుగా వస్తున్న ఏసుబాబు(50) కారు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు ఢీకొనడంతో షేక్ జమీల్ అనే మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ నవీన్ కుమార్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Recommended Video
ఆధారం కోల్పోయిన కుటుంబం
కాగా, తమకు న్యాయం చేయాలంటూ మృతుడు ఏసుబాబు బంధువులు ప్రమాద స్థలంలో ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తికి తగిన శిక్ష పడేలా చూస్తామని, న్యాయం జరిగేలా చేస్తామని హామి ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఏసుబాబుది పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు గ్రామం. అయితే, గత కొంత కాలంగా ముగ్గురు పిల్లలతో కలిసి నగరంలోని మాదాపూర్లో వాచ్మెన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఏసుబాబు మరణంతో తాము ఆధారం కోల్పోయామంటూ ఏసుబాబు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.