ఇప్పుడు చెప్పను, అప్పుడు మీ ముందుకు వస్తా: శిఖా చౌదరి, కనిపించని టెన్షన్
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరి విచారణ గురువారం సాయంత్రం ముగిసింది. ఉదయం నుంచి దాదాపు రాత్రి ఎనిమిది గంటల వరకు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత ఆమె విచారణ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడటానికి ముందు ఆమె చిరునవ్వులు కూడా చిందించారు.
శిఖా చౌదరి ముఖంలో ఎలాంటి టెన్షన్ లేదు
విచారణ అనంతరం శిఖాచౌదరి ముఖంలో ఎలాంటి బెదురు, భయం, టెన్షన్ కనిపించలేదు. వెళ్లేటప్పుడు స్కార్ఫ్ ధరించి లోనికి వెళ్లిన శిఖా చౌదరి బయటకు వచ్చేటప్పుడు మాత్రం కాస్త నవ్వు ముఖంతో, దర్జాగానే వచ్చారు. సుదీర్ఘ విచారణ నేపథ్యంలో ముఖంలో కాస్త ఆలసట కనిపించింది. మీడియాతో ఎక్కువసేపు మాట్లాడలేదు. నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు.
ఎన్నారై జయరాం హత్య కేసు: ఏసీపీ కార్యాలయానికి శిఖా చౌదరి.. ఇలా ఎందుకు చేశారు?
కేసు విచారణలో ఉంది.. ఇప్పుడు చెప్పను
శిఖా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తనను విచారణ కోసం పిలిచారని తెలిపారు. మళ్లీ అవసరమైతే పిలుస్తామని చెప్పారని, వారి విచారణకు తాను సహకరిస్తానని అన్నారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, కేసు విచారణ పూర్తయ్యాక తాను మీడియా ముందుకు వచ్చి అన్నీ మాట్లాడుతానని చెప్పారు. మీడియా మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా... ఇక ఏం చెప్పనని, విచారణ పూర్తయ్యేకే మీ ముందుకు వస్తానని స్పష్టం చేశారు. తనకు తెలిసిన సమాచారం పోలీసులకు చెప్పానన్నారు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని అన్నారు.
పద్మశ్రీ ఆరోపణలపై ప్రశ్నించగా
జయరాం హత్య కేసును తొలుత ఏపీలోని నందిగామ పోలీసులు విచారించారు. అనంతరం ఈ కేసు హైదరాబాదుకు బదలీ అయింది. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య పద్మశ్రీ ఆరోపణలు గుప్పించారు. పద్మశ్రీ ఆరోపణలపై మీడియా ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేయగా.. శిఖా చౌదరి మట్లాడేందుకు నిరాకరించారు. కేసు విచారణలో ఉన్నందున మాట్లాడలేనని సూటిగా చెప్పారు.