మరోసారి అధికారం ఇస్తే దేశం మూడు ముక్కలే.. వీహెచ్ హాట్ కామెంట్స్
బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కంటిన్యూ చేస్తోంది. దేశంలో కమల దళం అధికారంలోకి వచ్చిన రెండోసారి ఏం జరుగుతుందో చూస్తున్నారు గా అంటూ జనాలకు చెబుతోంది. ఇక తనదైన శైలిలో విమర్శలు చేసే సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి మూడవసారి అధికారం ఇస్తే దేశం ముక్కలవడం ఖాయం అంటూ విమర్శించారు. దేశాన్ని ముక్కలు చేయాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోందని.. అందుకే బీజేపీ నేతలు మతాల మధ్య విధ్వేషాలు కలిగించే కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఇతర మతాలను కించపరచటమే బీజేపీ ఎజెండాగా ఉందన్నారు. దేశాన్ని ముక్కలు చేయటమే బీజేపీ ఎజెండా అని.. కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని ఏకతాటిపై నడిపించే పార్టీ అని గుర్తుచేశారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర చేపడుతుందని వివరించారు. దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోందని.. అత్యాచారాలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. లైంగికదాడి చేసినవారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
రాజస్థాన్ ఉదయ్ పూర్లో నిర్వహించిన చింతన్ శివిర్లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. భారత్ జోడో యాత్రకు ప్రణాళికలు వేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అవనుంది. రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించింది.
పొలిటికల్ అఫైర్స్ కమిటి, టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్తోపాటు భారత్ జోడో యాత్ర ప్లానింగ్ మరియు కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక కమిటీలను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు.పొలిటికల్ అఫైర్స్ కమిటిలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, అనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేందర్ సింగ్ ఉన్నారు.
ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సర్వ సన్నద్దంతో ఉంది. ఇటు వీలు చిక్కినప్పుడల్లా.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేస్తున్నారు.