ఎమ్మెల్యేలను చేర్పిస్తే రూ.50 కోట్లు: రోహిత్ రెడ్డి, ఇద్దరూ దొంగలే అంటోన్న ఉత్తమ్
ఎమ్మెల్యేలతో బేరసారాల ఇష్యూ తెలంగాణలో రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఏం జరిగిందనే విషయం ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ వేదికగా మీడియాకు వివరిస్తారు. అయితే అంతకుముందే పైలట్ రోహిత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఆ ముగ్గురు తమపై ఒత్తిడి చేశారని వివరించారు. రోహిత్ రెడ్డి కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆ ముగ్గురు కలిసి..
తమను స్వామిజీ, నందు, సతీష్ సంప్రదింపులు జరిపారని రోహిత్ రెడ్డి పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరించారు. ఆ డీల్లో భాగంగానే తాము ఫామ్హౌస్లో మీట్ అయ్యామని వివరించారు. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని చెప్పారని సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను చేర్పిస్తే రూ.50 కోట్లు అంటూ చెప్పారు. బీజేపీలో చేరకుంటే వేధింపులు తప్పవని బెదిరించారని వివరించారు. ఈడీ, సీబీఐతో కేసులు పెట్టి వేధిస్తామని వార్నింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. అందుకే ఫామ్ హౌస్కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.
ఇద్దరూ దొంగలే: ఉత్తమ్
ఈ ఇష్యూపై మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఒకసారి అమ్ముడు పోతే అంతే అని ఫైరయ్యారు. వారు ఎన్నిసార్లయిన అమ్ముడుపోతారని చెప్పారు. నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారే. గువ్వల బాలరాజు మినహా.. మిగతా నేతలు కాంగ్రెస్ నుంచి జంప్ అయ్యారు. అందుకే ఉత్తమ్ ఇలా ఫైరయ్యారు. కేసీఆర్ ఒక రేటుకు కొంటే.. బీజేపీ వారికి డబుల్ ఆశచూపిందని వివరించారు ఇద్దరూ దొంగలేనని మండిపడ్డారు.
సినిమా ప్లాప్
బీజేపీ ముఖ్య నేత, ఎంపీ లక్ష్మణ్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రగతి భవన్ వేదికగా చేసిన డ్రామా అభాసు పాలయ్యిందని చెప్పారు. ఈ కుట్ర అక్కడే జరిగిందని మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీకి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని తెలిపారు. కానీ నిన్న తీసిన సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. అయితే కుట్రలో పోలీసులు కూడా పావులు కావడం బాధ కలిగిస్తోందని తెలిపారు. ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమకు ఎవరినీ ప్రలోభా పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.