అర్హుల ఇళ్లు వారికే: మంత్రి సబితాకు రిక్వెస్ట్.. వెంటనే స్పందించిన ఆమాత్యులు
జెఎన్ఎన్యూఆర్ఎమ్ స్కీమ్ లబ్ధిదారులు కొందరికీ ఇప్పటివరకు ఇళ్లు అందలేవు. దీంతో వారి బాధ వర్ణణాతీతం. న్యాయం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మహిళా నాయకురాలు ఇందిరాశోభన్ కోరారు. బాధితులతో కలిసి మంత్రికి ఆమె వినతిపత్రం సమర్పించారు. అసలైన అర్హులకు దక్కాల్సిన ఇళ్లను న్యాయంగా వాళ్లకు అందేలా చొరవ చూపాలని ఇందిరాశోభన్ విజ్ఞప్తి చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట్ నందనవనంలో జెఎన్ఎన్యూఆర్ఎమ్ స్కీమ్ కింద ప్రభుత్వం 512 నివాస గృహాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే వాటి తాళాలను కూడా వారికి అప్పగించాక.. అధికార పార్టీకి చెందిన కొందరు ఆ ఇళ్లను కబ్జాచేశారు. దీనిని ఇందిరాశోభన్ తప్పుపట్టారు. అక్కడికి వెళ్లిన వారిపై గూండాలు దాడులకు తెగబడుతున్నారని ఇందిరాశోభన్ ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే , హౌసింగ్ పీడీ, సరూర్నగర్ తహశీల్దార్, రాచకొండ పోలీస్ కమిషనర్లను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం విడ్డూరం అని చెప్పారు. గత 10 నెలలుగా ఎంతమంది ఉన్నతాధికారులను కలిసినా, న్యాయం మాత్రం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల తరపున స్వయంగా చొరవ తీసుకుని నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇందిరాశోభన్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. అప్పటికప్పుడే రంగారెడ్డి కలెక్టర్, హౌసింగ్ పీడీలతో ఫోన్లో మాట్లాడారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అసలైన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అందజేస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి హామీ పట్ల ఇందిరా శోభన్ సహా బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
ఏళ్ల నుంచి ఉన్న సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటం ఆనందించే విషయం. ఇందుకు కృషి చేసిన ఇందిరా శోభన్కు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్య పరిష్కారం కోసమే తాను చొరవ తీసుకున్నానని ఇందిరా శోభన్ వివరించారు. ఎట్టకేలకు బాధితులకు న్యాయం జరగాలని అనుకున్నామని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు.