దటీజ్..మహేష్ భగవత్: గాయపడ్డ మహిళకు స్వయంగా ట్రీట్మెంట్..ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి..!
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా ప్రథమ చికిత్స చేశారు. కాళ్లు, చేతులకు గాయాలు కాగా.. వాటికి ఆయనే కట్టుకట్టారు. అక్కడితో ఆగిపోలేదు. తన ఎస్కార్ట్ వాహనంలో ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. తానూ ఆసుపత్రికి వెళ్లారు. బాధితురాలికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసిన తరువాతే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారాయన.
శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది ఈ ఘటన. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం సమీపంలో ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి స్కూటీపై వెళ్తుండగా.. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ఆటో ట్రాలీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీని నడిపిస్తోన్న మహిళకు గాయాలయ్యాయి. చేతులు, కాళ్లు దోక్కుపోయాయి. వెనకల కూర్చున్న ఆమె కుమార్తె స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తోన్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ సంఘటనను చూశారు.
వెంటనే ఆయన తన వాహనంలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా మహిళకు ప్రథమ చికిత్స అందించారు. గాయాలైన చోట స్వయంగా ఆయనే ఆయింట్మెంట్ పూశారు. కట్టు కట్టారు. అనంతరం తన ఎస్కార్ట్ వాహనంలో ఆమెను సమీపంలోనే ఉన్న విజయా ఆసుపత్రికి తరలించారు. ఆయన కూడా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స గురించి ఆరా తీశారు. ఆ మహిళకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే స్పందించడం పట్ల స్థానికులు మహేష్ భగవత్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Recommended Video
#Road_Accident near Nagaram, @Keesaraps between 2 wheeler scooty and Auto trolly. #First_Aid treatment given to injured women by #CP_Rachakonda and shifted injured woman in an escort vehicle to Vijaya hospital today at 3 pm.@TelanganaDGP @TelanganaCOPs @hydcitypolice pic.twitter.com/nzpX4vtwBy
— Rachakonda Police (@RachakondaCop) February 28, 2020