హెటిరో సంస్థలపై ఐటీ దాడులు : ఏక కాలంలో 20 బృందాల సోదాలు..!!
ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు ప్రారంభించింది. ఈ ఉదయం నుంచి సంస్థకు సంబంధించిన అన్ని కార్యాలయాల పైన ఏక కాలంలో దాడులు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్..జీడిమెట్ల లో ఉన్న సంస్థ కార్యాలయంతో పాటుగా ఉత్పత్తి కేంద్రాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ సమయంలో చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లను సైతం హెటిరో ఉత్పత్తి చేసింది. సంస్థకు చెందిన సీఈవో తో పాటుగా డైరెక్టర్ల కార్యాలయాలు..నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆదాయపు పన్ను శాఖకి చెందిన ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్తో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా.. లేక, స్వయంగా ఐటీ అధికారులే తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే, సాధారణంగా సంస్థ పరిపాలనా కార్యాలయంతో పాటుగా యాజమాన్యానికి చెందిన వారి సంస్థలు - నివాసాల్లో సోదాలు చేయటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
అయితే, హెటిరో గ్స్ కార్పొరేట్ కార్యాలయం, ప్రొడక్షన్ కేంద్రాలు, హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాంకీ సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసారు. సోదాల తరువాత సమాచారం ఇస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా ప్రముఖ కార్పోరేట్ సంస్థల పైన ఐటీ అధికారులు పెద్ద ఎత్తున చేస్తున్న సోదాలతో ఇతర సంస్థలు సైతం అలర్ట్ అవుతున్నాయి. హెటిరో సంస్థకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు ఐటీ దాడుల వెనుక కారణం ఏంటనేదే చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి ఈ సాయంత్రం లేదా సోదాలు ముగిసిన తరువాత కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐటీ సోదాల వ్యవహారం పైన ఇప్పటి వరకు హెటిరో సంస్థ నుంచి సైతం ఎటువంటి స్పందన రాలేదు. ఐటీ సోదాలు జరుగుతున్న కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసారు. సంస్థల్లోని సిబ్బందిని సోదాలు పూర్తయ్యే వరకూ బయటకు వెళ్లద్దని ఐటీ అధికారులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. బయట వారిని ఉద్యోగులు మినహా ఇతరులను లోపలకు రానీయటం లేదు.